నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం..

by  |
నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం..
X

దిశ, కంటోన్మెంట్ : నిర్లక్ష్యపూరితంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్ ఢీకొట్టిన ఘటనలో నిండు ప్రాణం పోయింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం వెలుగులోకివచ్చింది. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర(22) ,రాహుల్(23),దీపక్(21)లు గత కొంతకాలం కిందట జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చారు.

ధర్మేంద్ర మేడ్చల్‌లో టైల్స్ దుకాణంలో పనిచేస్తుండగా, రాహుల్ అమీర్ పేటలోని ఓ ఎలక్రికల్ షాపు, దీపక్ బోయిన్ పల్లిలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ధర్మేంద్ర తన యాజమాని హోండా యాక్టివా బైకు తీసుకొని అమీర్ పేటకు వెళ్లాడు. అక్కడ రాహుల్‌ను పిక్ అప్ చేసుకుని బోయిన్ పల్లికి వచ్చాడు. మరల బోయిన్ పల్లిలో దీపక్‌ను తీసుకొని ఈ ముగ్గురు హోండా యాక్టివా పై సికింద్రాబాద్‌కు పయనమయ్యారు.

ఈ క్రమంలోనే తాడుబండ్ ముస్లీం శ్మశాన వాటిక వద్ద వేగంగా దూసుకువచ్చిన వీరి ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనంపై ఉన్న ముగ్గురు రోడ్డుకు అవతల పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు.రోడ్డు ప్రమాదంలో ధర్మేంద్ర అక్కడిక్కడే మృతి చెందగా, రాహుల్, దీపక్‌లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా రాహుల్, దీపక్ లు అన్నదమ్ములు. ధర్మేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story