మేఘాలయాలో ఘర్షణలు.. ఒకరు మృతి

by  |
మేఘాలయాలో ఘర్షణలు.. ఒకరు మృతి
X

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఖాసి స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలోని ఇచ్చామతి ఏరియాలో శుక్రవారం బద్దలైన ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన ట్యాక్సీ డ్రైవర్ లుర్షాయి హిన్నేత.. ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జిల్లా మెజిస్ట్రేట్ శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు కర్ఫ్యూ అమలు చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. మెస్సేజీలపైనా ఆంక్షలు విధించారు.

సీఏఏ, ఇన్నర్ లైన్ పర్మిట్‌పై ఖాసి స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించిన సమావేశం ముగిసిన తర్వాత ఈ ఘర్షణలు జరిగాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్‌గా గుర్తించిన ప్రాంతాల్లోకి విదేశీయులు, నాన్‌లోకల్ ఇండియన్స్ వెళ్లేందుకు అనుమతి పత్రాన్ని చూపించే పద్ధతిని మేఘాలయాలో కూడా అమలు చేయాలని గిరిజన సంఘాలు సుదీర్ఘ కాలంగా అభ్యర్థిస్తున్నాయి. ఇప్పుడు ఈ పద్ధతి ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్‌లలో అమల్లో ఉంది. అయితే, ఈ ఘర్షణలకు సంబంధించిన కచ్చిత కారణం ఇంకా తెలియరాలేదు.



Next Story

Most Viewed