బ్లాక్ ఫంగస్‌తో ఒకరు.. కరోనాతో ఒకరు మృతి

by  |
బ్లాక్ ఫంగస్‌తో ఒకరు.. కరోనాతో ఒకరు మృతి
X

దిశ, పరిగి: జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని సంతోషపడేలోపే, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. రోజుకో కొత్త కేసు నమోదు అవుతూ జనాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా.. బ్లాక్ ఫంగస్‌తో ఓ వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన పరిగి డివిజన్ దోమ మండలం దాదాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. దాదాపూర్ గ్రామానికి చెందిన కంపిల్ల శ్రీను(45)కు ఈనెల 12 వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కోస్గీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. లక్షల రూపాయలు వెచ్చించి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. చివరకు డబ్బులు అన్నీ అయిపోవడంతో ఆస్పత్రి వారు బెడ్ ఖాళీ చేయాలని సూచించారు.

ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శ్రీను కుడికన్ను వాపు వచ్చి మూసుకుపోయింది. దీంతో ఆయన్ను శంకర్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకిందని నిర్ధారించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో ఆరు లక్షల వరకు శ్రీను ఆస్పత్రి వెచ్చించించినా ఫలితం లేకుండా పోయింది. శ్రీను మరణంతో పరిగి నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తొలి మరణం నమోదైంది.

కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి

దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామానికి చెందిన మహిళ(46) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తోంది. కరోనా అనుమానిత లక్షణాలతో ఈ నెల 16న పరిగిలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ ఉన్నట్టు తేలింది. కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పదిహేను రోజులుగా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది.



Next Story

Most Viewed