ఒలింపిక్ ఆశా కిరణాలు.. బ్యాడ్మింటన్ ప్లేయర్లు

by  |
PV Sindhu
X

దిశ, స్పోర్ట్స్: ఐదేళ్ల క్రితం రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియాకు వచ్చిన పతకాలు రెండే రెండు. దానిలో ఒకటి బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సాధించిన రజత పతకం. 15 క్రీడా విభాగాల్లో 117 మంది అథ్లెట్లు రియోకు వెళ్లగా.. కేవలం ఇద్దరు మాత్రమే పతకాలు సాధించి భారత జట్టు పాయింట్ల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా 115 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తున్నారు. కానీ వీరిలో ఎంత మంది పతకాలు సాధిస్తారనేది వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. ఈ సారి కచ్చితంగా పతకం వస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నది బ్యాడ్మింటన్‌పైనే. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు రెండో సారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టనున్నది. ఆమెకు తోడుగా పురుషుల సింగిల్స్‌లో బి. సాయిప్రణీత్, పురుషుల డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి టోక్యోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి వీరి ప్రస్తుత ఫామ్ ఎలా ఉన్నది. రాబోయే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తారా అనేది ఒక సారి చూద్దాం.

ఫామ్‌లో లేని సింధు..

రియో ఒలింపిక్స్‌లో ఆఖరి మెట్టుపై విఫలమై రజత పతకంతో సరిపెట్టుకున్న పీవీ సింధు.. ఈ సారి ఆ పతకాన్ని స్వర్ణంగా మార్చుకోవాలని భావిస్తున్నది. అయితే 2016లో సింధు ఫామ్‌ను ప్రస్తుతం తాను ఆడుతున్న తీరును పరిశీలిస్తే ఆ ఘనత సాధిస్తుందా అనే అనుమానం నెలకొన్నది. రియో ఒలింపిక్స్ ముందు 13 టోర్నమెంట్లలో 36 మ్యాచ్‌లు ఆడి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ సంపాదించింది. కానీ ప్రస్తుత ఒలింపిక్స్ ముందు సింధు ఆడింది కేవలం 7 టోర్నీల్లో 20 మ్యాచ్‌లు మాత్రమే. అయితే 2016లో సిల్వర్ మెడల్ తర్వాత 2018 కామన్వెల్త్ గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్స్ సాధించింది. ఇక 2019 నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక అప్పటి నుంచి సింధు ఫామ్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా సమయంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయింది. మలేషియా ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లలో ఆశించిన మేర రాణించలేదు. ఎప్పటిలాగే తన ప్రత్యర్థి కరోలినా మరీన్‌పై రెండు సార్లు ఓడిపోయింది. అయితే ఈ సారి మరీన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడంతో పీవీ సింధుకు మార్గం సుగమమైనట్లే అని పలువురు భావిస్తున్నారు. స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతో బ్యాడ్మింటన్ భారం అంతా సింధూపైనే పడింది. చైనా, థాయిలాండ్, మలేషియా, జపాన్ ఆటగాళ్ల నుంచి సింధూకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వారందరితో గతంలో ఆడిన అనుభవంతో సింధూ పై చేయి సాధించవచ్చు.

పురుషులు సాధిస్తారా?

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నీడలో బి. సాయి ప్రణీత్ విజయాలు అంతగా ఎవరికీ చేరలేదు. ఈ సారి ఒలింపిక్స్‌కు శ్రీకాంత్ తప్పకుండా అర్హత సాధిస్తాడని భావించినా.. అతడికి చుక్కెదురైంది. అనూహ్యంగా వరల్డ్ ర్యాంకింగ్స్‌తో సాయి ప్రణీత్ టోక్యోకు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో సాయి ఒక్కడే ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 18 ఏళ్ల వయసులో వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. 2019 స్విస్ ఓపెన్ సెమీస్‌లో వరల్డ్ నెంబర్ 5 చెన్ లాంగ్‌ను ఓడించాడు. అయితే ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. థాయిలాండ్ ఓపెన్‌, సింగపూర్ సిరస్‌లో స్వర్ణపతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత కొన్నాళ్లుగా సాయి ప్రణీత్ నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో సాయి ప్రణీత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ మంచి స్థితిలో ఉండటంతో ఒలింపిక్స్ చేరుకున్నాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రత్యర్థులుగా తలపడిన చిరాగ్ షెట్టి-సాత్వీక్ సాయిరాజ్ రాంకీరెడ్డి గత కొంత కాలంగా డబుల్స్ జోడీగా రాణిస్తున్నారు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించి వార్తల్లో నిలిచారు. 2016 నుంచి ఈ జోడి డబుల్స్ ఆడుతున్నారు.

2019లో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి చేరుకున్నారు. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్న ఈ జంట టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించినంత సులభంగా వీరి ప్రయాణం కొనసాగేలా లేదు. చైనా, మలేషియా, జపాన్ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవనున్నది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు 7 నుంచి 8 మంది ఆటగాళ్లు ఒలింపిక్స్‌కు బ్యాడ్మింటన్ విభాగంలో అర్హత సాధించేవారు. కానీ ఇప్పుడు కేవలం నలుగురే టోక్యోకు వెళ్తున్నారు. మరి వీరిలో ఎంత మంది పతకాలు సాధిస్తారో చూడాలి.


Next Story

Most Viewed