గ్రేటర్‌లో అధికారుల సమాయత్తం.. లాక్‌డౌన్‌కు సిద్ధం..!

by  |
గ్రేటర్‌లో అధికారుల సమాయత్తం.. లాక్‌డౌన్‌కు సిద్ధం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజధానిలో లాక్‌డౌన్ విధింపు తప్పదా.. రాత్రి పూట కర్ఫ్యూ స్థానంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించే పరిస్థితులు ఉన్నాయా అంటే అవుననే తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ విధించినప్పటికీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్ విధించే​దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని నిరాశ్రయులు, బిచ్చగాళ్లను నైట్ షెల్టర్లకు తరలించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది.

గ్రేటర్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సిద్దంగా ఉండేలా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా లాక్‌డౌన్​విధిస్తే నిరాశ్రయులు, బిక్షగాళ్లపై ఎక్కువ ప్రభావం పడుతున్నట్టు గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర సూచనల మేరకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో కరోనా సంబంధ అంశాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త కేసులు, మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్ ​నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది.

రోజంతా అన్ని బంద్​ ఉంటే రోడ్ల పక్కన ఉండేవారికి, నిరాశ్రయులకు ఆహారం, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా ముందుగానే వారందరిని బల్దియా నైట్​షెల్టర్లకు తరలించే ప్రక్రియను చేపట్టారు. మే నెల మొదటి వారంలోనే లాక్‌డౌన్​విధించే పరిస్థితులు ఉండటంతో ఆ లోపే వీలైనంత ఎక్కువ మందిని తమ పర్యవేక్షణలో ఉంచేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 15 నైట్ షెల్టర్లు పనిచేస్తుండగా.. సుమారు ఆరు వందల మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. నైట్​ షెల్టర్లును స్వచ్ఛంద సంస్థలే నిర్వహిస్తుండటంతో వారికి ఉన్న ఇతర ఆశ్రమాలు, షెల్టర్లలో కూడా సహాయం అందించేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 1,516 మంది నిరాశ్రయులు ఉన్నార‌ని జీహెచ్ఎంసీ గతంలో నిర్వహించిన ఓ స‌ర్వేలో తేలింది. వీరిలో 1,128మంది పురుషులు, 328 మంది మ‌హిళ‌లు ఉన్నారు. గతేడాది లాక్‌డౌన్​విధించినప్పుడు సెక్రటేరియట్, నాంపల్లి, ఎంజీబీఎస్, సికింద్రాబాద్​ఏరియాల్లోనే రోడ్లపైనే, పార్కుల్లోనే వీరంతా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో అదనంగా ఏడు తాత్కలిక నైట్​షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్​ గ్రౌండ్, గాంధీనగర్‌లోని​ఓ ఫంక్షన్​హాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని స్టేడియాలకు వందల మందిని తరలించి భోజనాన్ని అందించారు. కొన్ని ఏరియాల్లో స్థానికుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవడంతో అక్కడ క్యాంపులు ఏర్పాటు చేయలేకపోయారు.

ఈ సారి ఇలాంటి ఇబ్బందులను తప్పించుకునేందుకు ముందస్తుగానే నైట్​షెల్టర్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఉండే వారితో పాటు బిచ్చగాళ్లను నైట్​షెల్టర్ ​కేంద్రాలకు తరలించారు. లాక్‌డౌన్ విధించిన తర్వాత కూడా ఈ పనులను చేపట్టేందుకు కొంత వెసులుబాటు ఉంటుందని, మంది ఎక్కువుంటే ఈ సారి కూడా తాత్కలికంగా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.



Next Story

Most Viewed