‘కరోనా’ కర్నూల్ టు గద్వాల..

by  |
‘కరోనా’ కర్నూల్ టు గద్వాల..
X

దిశ, మహబూబ్‌‌నగర్ : నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారిని నియంత్రించేందుకు అటు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే ఇటు కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగుళాంబ గద్వాల ప్రాంతం ఇప్పటికే రెడ్ జోన్‌లో ఉండటంతోపాటు ఇక్కడ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం లేదు. అంతేగాకుండా ఈ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూల్‌లోనూ కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం రెడ్‌జోన్‌లో ఉంచింది. అయితే, కొందరు అధికారులు కర్నూల్‌లో స్థిరపడటం ద్వారా రోజూ అక్కడ నుంచి జిల్లాకు రావడం ద్వారా ‘కరోనా’ సోకే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా గద్వాల ప్రాంతంలో బయటపడిన పలు కేసులకు లింకు కర్నూల్ జిల్లానే అని అధికారులు గుర్తించారు.

సరిహద్దుల నియంత్రణ..

జిల్లా సరిహద్దుల్లో రాకపోకలను నియంత్రించేందుకు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇటు గద్వాల నుంచి, అటు కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నదీపరీవాహాక ప్రాంతాల‌పై కూడా అధికారులు దృష్టి సారించి నది ప్రాంతంలో గుంతలు తవ్వించి వాహనాలు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులు గద్వాలకు కర్నూల్ నుంచి వస్తున్న పాలు, కూరగాయలను కూడా పూర్తిగా నిలిపివేయడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల తీరు వివాదాస్పదం..

జిల్లాలోని గద్వాల, అలంపూర్‌తో పాటు వడ్డేపల్లి, శాంతినగర్, అయిజ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న చాలా మంది అధికారులు నిత్యం కర్నూల్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. వృత్తి రీత్యా తెలంగాణలో పనిచేస్తున్న వీరిలో చాలా మంది తమ పిల్లల చదవులు, ఇతరత్రా కారణాలతో స్థిర నివాసం మాత్రం ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్‌లో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయడంతో అధికారులకూ ఇబ్బందుల తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న చాలామంది పోలీసులు కర్నూల్ నుంచి ఆటోలలో గుంపులు గుంపులుగా వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. దీంతో పలు సార్లు అధికారులకు, సరిహద్దు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాము కూడా విధులు నిర్వహించేందుకే వస్తున్నమని అధికారులు చెప్పడం, తమకు ఉన్న ఆదేశాల మేరకు అనుమతించలేమంటూ పోలీసులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది.

అధికారులకేనా అనుమతులు.?

తమను అవసరాల నిమిత్తం అటు వైపునకు (కర్నూలు) అనుమతించని పోలీసులు అధికారులను మాత్రం నిత్యం ఎలా అనుమతిస్తారని ప్రజలు పలు ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో వైరస్ ప్రభావం అధికంగా ఉందని చెబుతున్న అధికారులు అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో ఈ వలస అధికారులలో కూడా భయం మొదలైంది. సరిహద్దులో పహారా కాస్తున్న సిబ్బంది ఏకంగా కర్నూల్ నుంచి వస్తున్న అధికారుల ఐడీల ఫొటోలను తీసి నేరుగా జిల్లా కలెక్టర్‌కు పంపుతున్నారు.

ఇబ్బందులు కలగకుండా చూడాలి..

ఇదిలా ఉండగా అధికారులు కర్నూలు, ఇతర సరిహద్దుల నుంచి ఎవరినీ అనుమతించకపోవడం వల్ల జిల్లాలో పాలు, కూరగాయల కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. వాటి కొరత ఏర్పడకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కర్నూల్ నుంచి వచ్చే అధికారులకూ స్క్రీనింగ్ ఉంటే బాగుంటుందనీ, ఎందుకంటే కర్నూల్ నుంచి కరోనా కేసులు జిల్లాలో పాకే ప్రభావముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: officers, coming, redzone, kurnool, borders closed, ap state, telangana, covid 19



Next Story

Most Viewed