జిల్లాకు ఎవ‌రెవ‌రు వ‌చ్చారు !

by  |
జిల్లాకు ఎవ‌రెవ‌రు వ‌చ్చారు !
X

దిశ‌, ఖ‌మ్మం: కొవిడ్ -19 కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టంతో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా యంత్రాంగం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇటీవ‌లి కాలంలో విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బెంగ‌ళూరు, ఢిల్లీ, ముంబై ప‌ట్ట‌ణాల నుంచి జిల్లాకు చేరుకున్న వారిని గుర్తించి వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. రెవెన్యూ, పంచాయ‌తీ అధికారుల‌తోపాటు ఏఎన్ఎం సిబ్బందిని కూడా ఇందుకు వినియోగించుకున్నారు. ఉభ‌య జిల్లాల క‌లెక్ట‌ర్లు క‌ర్ణ‌న్‌, ఎంవీరెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు.

ఇప్ప‌టికే గ‌త 7రోజులుగా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఇంటింటి స‌ర్వే కొనసాగిస్తూ రాష్ట్రం వెలుప‌లా నుంచి వ‌చ్చిన వారి వివ‌రాలను అధికారుల‌కు చేర‌వేస్తున్నారు. ఏమాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లున్నా క్వారంటైన్‌కు షిప్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఓ ఆధ్యాత్మిక సభకు హాజరై వచ్చిన వ్య‌క్తితో పాటు చుంచుప‌ల్లి మండ‌లం అనంతపురం వాసిని, లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన మ‌రొక‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన అనేక మందిలో కోవిడ్‌-19 పాజిటివ్ వ‌స్తుండ‌టం, ఇప్ప‌టికే ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో జిల్లావాసులు ఆందోళ‌న చెందుతున్నారు. వీరు జిల్లాకు చేరుకున్నాకా.. ఎక్క‌డెక్క‌డ తిరిగారు. ఎవ‌రెవ‌ర‌ని క‌లిశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

వీరితో పాటు భ‌ద్రాచ‌లం, మ‌ణుగూరు, ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన మ‌రికొంత‌మంది కూడా ఢిల్లీలో జ‌రిగిన ఆధ్యాత్మిక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అధికారులు, ఇటీవ‌లి కాలంలో రైలు మార్గం ద్వారా, విమానాల ద్వారా ఢిల్లీ చేరుకున్న వారి వివ‌రాల‌ను క‌నుక్కునే ప‌నిలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గూడెం జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. అయితే ఇట‌లీలో ఉంటూ ఇటీవ‌ల జిల్లాకు వ‌చ్చిన యువ‌తి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం డిశ్చార్జి అయిన విష‌యం తెలిసిందే.

Tags: Coronavirus Effect, Collectors, Spiritual House in Delhi, Bhadradri Hosigode, Home Survey, Khammam, Italy, Young Woman, Gandhi Hospital



Next Story