ప్రధాని మోడీకి.. ఒడిశా సీఎం లేఖ

by  |
ప్రధాని మోడీకి..  ఒడిశా సీఎం లేఖ
X

భువనేశ్వర్: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఒడిశాలో కరోనాను అదుపు చేసేందుకు తాము అనుసరిస్తున్న విధానంపై ప్రధాని మోడీకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4.7 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్టు తెలిపారు. ఇంకా రోజుకు 3లక్షలకు పైగా డోసులు ఇచ్చే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోందన్నారు. కాగా అప్పుడప్పుడు మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తుండటంతో రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్స్ అందించ లేకపోతున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను మెరుగు పరిచేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు.

వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలి..

కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలని మోడీని ఆయన కోరారు. ఇలా చేస్తే వ్యాక్సిన్ కొనుగోలు చేసే శక్తి ఉన్న వారు వాటిని మార్కెట్‌లో కొనుగోలు చేసి వ్యాక్సిన్ వేయించుకుంటారని తెలిపారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీ చేస్తాయని.. తద్వారా ప్రభుత్వాలపై భారం కూడా తగ్గుతుందని అన్నారు.

మరిన్ని వ్యాక్సిన్స్ కు అనుమతి ఇవ్వాలి:

ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయమైన సంస్థల ద్వారా అనుమతులు పొందిన పలు వ్యాక్సిన్స్‌ను దేశీయంగా వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇటీవల రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టీకా ఉత్పత్తిని పెంచాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఔషద తయారీ రంగంలో మన శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వాడుకునేందుకు కృషి చేయాలని తెలిపారు.

కేసుల సంఖ్య అధికంగా ఉన్న నగరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి:

దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న మెట్రోపాలిటన్ నగరాలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేంద్రం విధిస్తున్న వయో పరిమితి విషయంలో ఈ నగరాలకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలని తెలిపారు.

Next Story