‘ముంబయి పవర్ కట్‌ వారి పనే.. ఎన్‌వైటీ కథనం నిజమే’

by  |
‘ముంబయి పవర్ కట్‌ వారి పనే.. ఎన్‌వైటీ కథనం నిజమే’
X

ముంబయి: పొరుగు దేశం చైనా నుంచి కొందరు సైబర్ అటాకర్ల దాడి కారణంగా గతేడాది మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కొన్ని గంటలపాటు పవర్ కట్ జరిగి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ నిజమేనని పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనంలో వాస్తవాలున్నాయని అన్నారు. ఈ అంశంపై దర్యాప్తునకు మూడు కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. సైబర్ శాఖ నుంచి తమకు త్వరలోనే నివేదిక రానుందని చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో ముంబయిలోని ఓ పవర్ గ్రిడ్‌లో తలెత్తిన సమస్యతో కొన్ని గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రైన్‌లు, హాస్పిటళ్లు, స్టాక్ ఎక్స్‌చేంజ్ సహా వాణిజ్య సముదాయాలూ దాదాపు మూతపడిపోయాయి.

సెంట్రల్ ముంబయిలోని సబర్బన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 12 గంటలపాటు విద్యుత్ నిలిచిపోయింది. పద్ఘాలోని పవర్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌లో మాల్వేర్‌ను ప్రవేశపెట్టినట్టు తొలుత సైబర్ డిపార్ట్‌మెంట్ కూడా అభిప్రాయపడింది. లడాఖ్‌లో భారత్, చైనా దేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పుడే దేశంలో విద్యుత్ సరఫరాను పంపిణీ చేసే పలు కేంద్రాల్లో మాల్వేర్‌ను పంపించినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. మసాచుసెట్స్‌కు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ మాల్వేర్ పంపడాన్ని గుర్తించింది. పంపిన మొత్తం మాల్వేర్‌లో చాలా వరకు యాక్టివేట్ కానేలేదని తెలిపింది. అంటే యాక్టివేట్ అయిన కొద్దిమొత్తం మాల్వేర్ ముంబయిలో విద్యుత్‌కు అంతరాయం కలిగించిందని తెలుస్తున్నది. ఈ మాల్వేర్‌ను చైనాకు చెందిన రెడ్ ఎకో పంపించి ఉండొచ్చని ఆ రిపోర్టు పేర్కొంది.



Next Story

Most Viewed