‘నర్సులు మలయాళంలో మాట్లాడొద్దు’

by  |
‘నర్సులు మలయాళంలో మాట్లాడొద్దు’
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ప్రభుత్వాస్పత్రి గోవింద్ వల్లబ్‌పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)‌లో నర్సులు దక్షిణాది భాష మలయాళం మాట్లాడవద్దని ఆదేశాలు వివాదాన్ని రేపాయి. ప్రతిపక్షాలు మండిపడటంతో ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. జిప్మర్‌లో వర్కింగ్ ప్లేస్‌లో మలయాళం మాట్లాడుతున్నారని, ఎక్కువ మంది పేషెంట్లు, కొలీగ్‌లు వీటిని అర్థం చేసుకోలేకపోవడంతో ఇబ్బందికరంగా ఉన్నదని ఓ ఫిర్యాదు వచ్చిందని ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శనివారం పేర్కొంది.

అందుకే నర్సింగ్ స్టాఫ్ మొత్తం హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లోనే మాట్లాడాలని ఆదేశించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆదివారం ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఆదేశాలు ఢిల్లీ ప్రభుత్వం నుంచి లేదా హాస్పిటల్ యాజమాన్యం నుంచి వెలువడలేదని, నర్సింగ్ స్టాఫ్ మధ్య ఇంటర్నల్ కమ్యూనికేషన్‌లాగే ఉన్నదని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఇవి జారీ అయినట్టూ తమకు తెలియదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

భాషపై వివక్ష ఆపండి: రాహుల్

భారతీయ భాషల్లో మలయాళమూ ఒకటని స్పష్టం చేస్తూ భాషపై వివక్షను ఆపండని రాహుల్ గాంధీ ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఈ ఉదంతం వివక్షాపూరితమైనదని, భారత రాజ్యాంగం హామీపడ్డ ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ‘ప్రజాస్వామిక భారతదేశంలో ఒక సంస్థ మాతృభాషను మాట్లాడొద్దని ఒక సంస్థ ఆదేశించవచ్చునా? ఇది ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు. భారత పౌరుల ప్రాథమిక హక్కుల హననమే’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.



Next Story