24 గంటల్లో 40వేల పాజిటివ్‌లు

by  |
24 గంటల్లో 40వేల పాజిటివ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి శర వేగంగా విజృంభిస్తోంది. రోజులో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య 40వేలు దాటింది. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 11లక్షల మార్కు దాటింది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 40,425 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి రోజులో నమోదైన గరిష్ట కేసుల సంఖ్య ఇదే కావడం ఇటీవల పెరిగిన వ్యాధి వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 11,18,043కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 681 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 27,497కు చేరింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 7,00,087 మంది కోలుకోగా ప్రస్తుతం 3,90,459 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో కొద్ది రోజులుగా కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. పరీక్షలు ఎక్కువగా చేసి పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేయడం కారణంగానే ఇక్కడ కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఒక్క రోజులో నమోదయ్యే కేసులు ట్రిపుల్ డిజిట్‌కు తగ్గి కేవలం 954 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,23,747కు చేరింది. 35కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3663 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులో 8240 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,18,695కు వెళ్లింది. 24 గంటల్లో వైరస్ బారినపడి 176 మంది చనిపోగా మొత్తం మరణాలు 12,030కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 4985 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,75,678కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 70 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2551కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 49,439 కేసులకు గాను 2167మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో 24 గంటల్లో 4074 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 53,724కి చేరింది. ఒక్కరోజే 54 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 696 మంది మృత్యువాత పడ్డారు.



Next Story

Most Viewed