మల్లారెడ్డి కబ్జా ఆస్పత్రిని ఫ్రీ కొవిడ్ సెంటర్‌గా మార్చండి : ఎన్ఎస్‌యూఐ

by  |
మల్లారెడ్డి కబ్జా ఆస్పత్రిని ఫ్రీ కొవిడ్ సెంటర్‌గా మార్చండి : ఎన్ఎస్‌యూఐ
X

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం మల్లారెడ్డి వైద్యశాలకు నిరసన సెగ తాకింది. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు శుక్రవారం పీపీఈ కిట్లు ధరించి పెద్ద ఎత్తున మల్లారెడ్డి హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ హాస్పిటల్ బోర్డుకు నల్లరంగు వేశారు. చెరువులను ఆక్రమించి నిర్మించిన హాస్పిటల్ ను ఉచిత కరోనా వైద్యశాలగా మార్చాలని, కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆక్రమణలకు పాల్పడుతున్న మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. కరోనా బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే రాష్ట్రంలో ప్రజలు బాగానే ఉన్నారని, పరిస్థితులు అదుపులో ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ మీడియా ముఖంగా వెల్లడించడం సిగ్గుచేటన్నారు. తమ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే పీపీఈ కిట్లు ధరించి నిరసన తెలుపుతున్నామన్నారు. నిరసన తెలుపుతున్న క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో దుండిగల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిరసన కారులను అరెస్టు చేశారు.


Next Story

Most Viewed