రాజ్‌నాథ్ సింగ్‌పై ప్రివిలేజ్ నోటీసు..లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ అందజేత

by I. Sairam |

ఆపరేషన్ సిందూర్‌లో మృతుల వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి దాచిపెట్టి, పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ అందజేసింది.

రాజ్‌నాథ్ సింగ్‌పై ప్రివిలేజ్ నోటీసు..లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ అందజేత
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆపరేషన్ సిందూర్‌లో మృతుల వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి దాచిపెట్టి, పార్లమెంటును తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ (సభా హక్కుల ఉల్లంఘన) నోటీసును మంగళవారం సమర్పించారు. అలాగే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖ కూడా రాశారు. ఈ ఆపరేషన్‌లో సైనికులు ఎవరూ మరణించలేదని 2025 జూలై 28న లోక్‌సభలో రక్షణ శాఖ మంత్రి ప్రకటన చేశారని తెలిపారు. కానీ ఇటీవల ఆరుగురు సిబ్బంది మరణించినట్టు ప్రభుత్వం వెల్లడించిందని పేర్కొన్నారు. ఒక మంత్రి సభలో తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా సమాచారాన్ని దాచడం సభ హక్కుల ఉల్లంఘన, సభను ధిక్కరించడమే అవుతుందని వేణుగోపాల్ తెలిపారు. అందుకే రాజ్‌నాథ్ సింగ్‌పై సభ హక్కుల ఉల్లంఘన చర్యలను ప్రారంభించాలని కోరారు. పార్లమెంట్ లో వివరాలు వెల్లడించకపోవడం మరణించిన ఆరుగురు సిబ్బంది కుటుంబాలకు, సాయుధ దళాలకు జరిగిన తీవ్ర అవమానమని అభివర్ణించారు. జాతీయవాద ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం వారి అమరత్వంపై అబద్ధాలు చెప్పిందని ఆయన విమర్శించారు. వెంటనే రాజ్‌నాథ్ సింగ్ రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story