వైరసే లేదు.. టీకాలెందుకు?

by  |
Corona vaccine
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా తగ్గిందనే భావనతో చాలా మంది టీకాలు వేసుకోవడం లేదని వైద్యారోగ్యశాఖ అంతర్గత సర్వేలో తేలింది. ఒక వేళ తమకు కరోనా సోకినా యాంటీబాడీలు(వైరస్​ నుంచి కాపాడే ప్రతిరక్షకాలు)ఉత్పత్తి అవుతాయని పలువురు చెబుతున్న మాటలతో అధికారులు షాక్​ అవుతున్నారు. ప్రతిరక్షకాలు వచ్చిన తర్వాత తమకేం కాదులే? అనే ధీమానూ వ్యక్తం చేస్తున్నారట. టీకా తర్వాత వచ్చే సమస్యలు కంటే, కరోనా రాకుండ జాగ్రత్తలు తీసుకోవడమే మేలని కొందరు విచిత్రంగా వెల్లడిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

పైగా వైరస్​ వ్యాప్తి ప్రస్తుతం లేదని, రాబోయే రోజుల్లో కూడా ఉండదని స్వయంగా ఆరోగ్యశాఖ చెబుతున్నప్పుడు టీకాలు ఏం అవసరం? అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాక టీకాలు పనిచేయడం లేదనే అపోహలతో కొందరు డోసులకు దూరంగా ఉంటున్నట్లు వైద్యశాఖ పేర్కొన్నది. అర్హుల్లో అత్యధికంగా టీకా పొందని జిల్లాల్లో మేడ్చల్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. అవగాహన కల్పించినా, డోసులు పొందేందుకు ముందుకు రావడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది వివరిస్తున్నారు.

మరోవైపు బలవంతంగా వ్యాక్సిన్లు వేయలేమని ఆరోగ్యశాఖ పేర్కొంటుంది. దీంతో చేసేదేమీ లేక ఉన్నతాధికారులు సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే వంద శాతం వ్యాక్సినేషన్ సాధ్యమవుతుందా? లేదా అనే విషయంలో మాత్రం ఉన్నతాధికారులు టెన్షన్​పడుతున్నారు. ప్రజల నుంచి స్పందన రాకుంటే ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు.

మేడ్చల్‌లో 7 లక్షల మంది వేసుకోలే…

గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోని మేడ్చల్​జిల్లాలో అత్యధికంగా 7,41,684 మంది టీకా తీసుకోలేదు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 4,92,304 మంది వ్యాక్సిన్​తీసుకోలేదు. అర్బన్​ప్రాంతాల్లో ఉండి టీకా వేసుకోకపోవడంతో అధికారులు విస్తుపోతున్నారు. వీరందరికీ వ్యాక్సిన్​పంపిణీ చేసేందుకు అధికారులు ప్రత్యేకంగా ప్లాన్ తయారు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కువ మంది టీకాలు తీసుకోని జిల్లాలు…
జిల్లా లబ్ధిదారులు
మేడ్చల్​ 7,41,684
నల్గొండ 4,92,304
సంగారెడ్డి 4,67,627
నిజామాబాద్ 3,78,298
వికారాబాద్​ 3,15,102
ఖమ్మం 2,58,435


Next Story

Most Viewed