అదనపు కలెక్టర్లకు జీతాలు లేవు.. మరి ఎలా తీసుకుంటున్నారు..?

by  |
అదనపు కలెక్టర్లకు జీతాలు లేవు.. మరి ఎలా తీసుకుంటున్నారు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అదనపు కలెక్టర్ల పోస్టులు, జీతాలపై చర్చ నడుస్తోంది. గతేడాది సెప్టెంబరు 9న​అదనపు కలెక్టర్ల పేరిట కొత్త పోస్టులు మంజూరయ్యాయి. కానీ, ఏడాదైనా నోటిఫై చేయలేదు. దీంతో వేతనాలు రావడం లేదని తెలిసింది. గతంలో జాయింట్​కలెక్టర్లుగా పని చేసిన వారేమో పాత పోస్టుల నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. ఇంకొందరికేమో కలెక్టర్ల ప్రత్యేక బడ్జెట్​నుంచి మంజూరు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. రీయింబర్స్‌మెంట్​పద్ధతిన వారికి సర్దుబాటు చేస్తున్నారని సమాచారం.

ఏడాది కాలంగా ఒక్క నెల కూడా వేతనం పొందని అదనపు కలెక్టర్ల సంఖ్య 19 మంది ఉన్నారని రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసినా నోటిఫై చేయని కారణంగా ఏడాది కాలంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ల ఆలోచనలకు ప్రతిరూపంగా జిల్లాకు ఇద్దరు చొప్పున అదనపు కలెక్టర్లు వచ్చారు. అప్పటి దాకా జాయింట్ కలెక్టర్లుగా ఉన్న వారిని అదనపు కలెక్టర్లుగా మార్చారు.

కానీ, 12 నెలలుగా వారి పోస్టులకు సంబంధించిన గెజిట్ పబ్లికేషన్ జారీ కాలేదు. ఇందులో ఒకరికేమో స్థానిక సంస్థల నిర్వహణను అప్పగించారు. మరొకరికి రెవెన్యూ సంబంధ అంశాలు చూడాలని ప్రస్తావించారు. కానీ ఆ రెవెన్యూ అంశాలేవి, ఏ స్థాయిలో చూడాలో నిర్దేశించకపోవడంతో ఏ పని చేయాలో తెలియడం లేదు. ఇప్పటి వరకు వారి జాబ్ చార్ట్ ను ఖరారు చేయలేదు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే ప్రభుత్వం ఏ పని అప్పగించినా చేయాలంటూ సలహా ఇస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే రెవెన్యూ ప్రత్యేక ట్రిబ్యునల్, హరితహారం, వైకుంఠధామాల నిర్మాణం.. వంటి పనులన్నీ చేస్తున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఓ పోస్టును సృష్టించిన ఏడాదికి కూడా నోటిఫై చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రద్దు కాని జేసీ పోస్టు..

రాష్ట్రంలో జాయింట్​కలెక్టర్ పోస్టు దశాబ్దాల తరబడి అత్యంత కీలకంగా ఉంది. కానీ ఆ పోస్టు అవసరం లేదని భావించిన కొత్తగా అదనపు కలెక్టర్లను సృష్టించారు. ఐతే కొత్త పోస్టులకు ఉత్తర్వులు రాలేదు. అలాగే జాయింట్​కలెక్టర్​పోస్టులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ కాలేదు. కానీ అదనపు కలెక్టర్ల పేరిట జిల్లా కేంద్రాల్లో బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. ఐతే వేతనాల కోసం సదరు అదనపు కలెక్టర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనాల కోసం ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ఐతే దానికి కొర్రీలు వేస్తున్నారని ఉద్యోగ సంఘం నాయకుడొకరు వాపోయారు. సీసీఎల్ఏ హోదాలో ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అంటే సీసీఎల్ఏ టు చీఫ్​సెక్రటరీ అన్నమాట.. ఐతే చీఫ్​సెక్రటరీ కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపినట్లు తెలిసింది. వారిద్దరూ ఒక్కరే కదా.. ఈ కొర్రీలు ఎందుకు అర్ధం కావడం లేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed