హమ్మయ్య.. యాదాద్రిలో నిల్

by  |
హమ్మయ్య.. యాదాద్రిలో నిల్
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో జిల్లా ప్రజలతోపాటు అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేటలో కరోనా కేసులు నమోదవడంతో యాదాద్రి వాసులు ఆందోళన చెందారు. జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌ మత ప్రార్థనలో పాల్గొన్న వారితోపాటు, జిల్లా వాసులెవరికీ కరోనా పాజిటివ్‌ లేదని ఆదివారం విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌ స్పష్టం చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మర్కజ్‌ మత ప్రార్థనలో జిల్లా నుంచి 12 మంది పాల్గొనగా, తొమ్మిది మంది బీబీనగర్‌ ఎయిమ్స్‌, ముగ్గురు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు 69 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచి రోజుకు రెండు పర్యాయాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వారి ఇళ్లకు జియోట్యాగింగ్‌ కు అనుసందానం చేశారు. అదేవిధంగా వారి ఇంటికి వచ్చిపోయేవారి కదలికలపై అధికారులు దృష్టిపెట్టారు. కాగా, నేటితో జిల్లాలో మరో నలుగురి హోంక్వారంటైన్‌ ముగియనున్నది. మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొన్న 12 మంది, వారి కుటుంబ సభ్యులు మాత్రమే హోంక్వారంటైన్‌లో ఉండనున్నారు. జిల్లాలో కరోనా కేసులు లేవని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు తెలిపారు. అయి నా ముందు జాగ్రత్తగా లాక్‌డౌన్‌ ముగిసేవరకూ అందరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

Tags: Yadadri district, Corona, No Positive cases, Nil, Geo Tagging, Markaz, Bibinagar Aim, Quarantine



Next Story

Most Viewed