నిపుణుల కమిటీ నివేదిక తప్పు..

by  |
నిపుణుల కమిటీ నివేదిక తప్పు..
X

దిశ, న్యూస్‌బ్యూరో :

రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌(NGT)లో వాడివేడీగా వాదనలు జరిగాయి. ఈ ప్రాజెక్టు అక్రమమని తెలంగాణ వాదనలు వినిపించింది. ‘నిపుణులు కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని’ అంటూ వివరించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మరో పిటిషన్ వేసిన శ్రీనివాస్ తరుపున న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఈ నివేదిక ఉందన్నారు. దానివలన ఏపీకి మాత్రమే లాభం చేకూరేలా ఉందని NGT ధర్మాసనానికి వివరించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న బెంచ్ విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.

తెలంగాణ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు శుక్రవారం NGT ఎదుట వాదనలు వినిపించారు. రాయలసీమ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణం పై నిపుణుల కమిటీ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించకుండానే పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని బెంచ్‌కు తెలిపారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణాల వలన రాయలసీమకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుందన్నారు. సంగమేశ్వరం సాకుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వలన రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరందించేందుకు ఏపీ ప్రణాళికలు రచిస్తోందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా నష్టం కలిగించేదిగా ఉందని.. వెంటనే దానిని తిరస్కరించాలని అడ్వకేట్ జనరల్ కోరారు. అంతేకాకుండా, నిపుణుల కమిటీలో నలుగురు సభ్యులు ఉంటే ఇద్దరు సభ్యులు ఏపీ వాదనను తోసిపుచ్చారని, మరొక సభ్యుడు మౌనంగా ఉంటే.. కేవలం ఒక్క సభ్యుడు ఇచ్చిన నివేదికను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించారు.

ఈ కమిటీ ఆధారంగా తీర్పునిస్తే తెలంగాణకు కృష్ణా ట్రిబ్యునల్‌లో తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ధర్మాసనానికి వెల్లడించారు. ఇదిలాఉండగా, కేంద్ర నిపుణుల కమిటీకి, కేంద్ర పర్యావరణ శాఖకు ‘కెరకట్టా’ అనే ఒకే అధికారి నివేదిక ఇచ్చారని.. శ్రీనివాస్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖ స్వతంత్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని కానీ, NGT ఆదేశాలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి నివేదిక ఇచ్చారని తన వాదనల్లో పేర్కొన్నారు.

అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి.. NGTకి ఎలాంటి సంబంధం లేదని, ఇది జలవివాదం మాత్రమే అని ట్రిబ్యునల్ ఎదుట ఏపీ తరుపున సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదనలు వినిపించారు. ఇరురాష్ట్రాల వాదనలు విన్న NGT తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

Next Story

Most Viewed