ఇకపై దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు ఉండవ్

by  |
No more bulk grain purchases
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలు కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని రాష్ట్ర పౌర సరఫరాల ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలని సూచించారు. దొడ్డు రకం బియ్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదని, ఈ ఒక్కసారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక అవకాశం లభించిందన్నారు. ఈసారి 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ ను తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ఒప్పుకుందన్నారు.

హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఎఫ్‌సీఐ ద్వారా తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళ్లేదని, కానీ ఈసారి ఆయా రాష్ట్రాల్లోనే ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో పండిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకునేందుకు అంగీకరించడం లేదన్నారు. రైతుల సౌలభ్యం కోసం ఈ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలను పెంచామన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కోసం 6,575 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అవసరాన్నిబట్టి మరికొన్ని కొనుగోలు కేంద్రాలను పెంచడానికి ఇబ్బంది లేదన్నారు.

నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ ఏడాది వానాకాలంలో 1.05 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, యాసంగి సీజన్‌లో 1.32 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు పంటను అమ్ముకున్న వెంటనే డబ్బులు అందించడానికి పౌర సరఫరాల శాఖకు అవసరమైన నిధులు ఉన్నాయని, ఇందుకోసం రూ. 20వేల కోట్లకు ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తు ఇచ్చిందన్నారు. ధాన్యంలో తేమ శాతం 17 లోపే ఉండాలన్నారు.


Next Story

Most Viewed