తెలంగాణలో రైతులకు పరిహారం ఇవ్వరా..?

by  |
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు ప్రతి ఏటా పంటలను నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత 3 ఏళ్లుగా రైతులకు నష్టపరిహారాలు చెల్లించకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారు. క్రాప్ డ్యామేజ్ వివరాలను నమోదు చేసి కేంద్రానికి నివేదికలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహించడంతో కేంద్రం నుంచి రైతులకు అందాల్సిన పరిహారాలు అందడం లేదు. అధిక వర్షాలతో గతేడాది 5.6లక్షల ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లగా ఈ ఏడాది ఇప్పటికే దాదాపుగా 5లక్షల ఎకరాల వరకు రైతులు పంట నష్టపోతున్నారు.

3 ఏళ్లుగా నిలిచిన పంట నష్టపరిహారాలు..

రాష్ట్రంలో 2018 ఏడాది నుంచి పంట నష్టపరిహారం చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. రైతుబంధు ప్రవేశపెట్టిన ఏడాది నుంచి రైతులకు పంట నష్టపరిహారాలు అందడం లేదని విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. సీజన్ మొదటల్లో అంచనాలకు మించిన కురుస్తున్న వర్షాలతో మొలకదశలోనే పంటలు దెబ్బతింటుండగా అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు తడిసి రైతులు పంట నష్టపోతున్నారు. గత 3 ఏళ్లుగా లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోతూనే ఉన్నాకాని ఆదుకోవల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో రూ.వేలు పెట్టుబడులు పెట్టిన రైతులు అప్పుల పాలవుతున్నారు.

కేంద్రానికి నివేదికలు పంపని రాష్ట్రం..

రాష్ట్రంలోని క్రాప్ డ్యామేజ్ వివరాలను ప్రభుత్వం అధికారికంగా ఏ ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో నష్టపోయాని సిద్ధంచేసి చేయాల్సి ఉంటుంది. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే కేంద్ర బృందం రాష్ట్రంలో పరిశీలన చేపట్టి నిర్ధారణ చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేస్తారు. విపత్తులతో రైతులు పంటలు దెబ్బతింటే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుంది. వీటిలోంచి వాణిజ్య పంటల ఎకరానికి రూ.20వేలు, ఆహార పంటలకు ఎకరానికి రూ. 10వేలను చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తారు. గత 3 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపించకపోవడంతో రైతులకు నష్టపరిహారాలు అందడం లేదని రైతుసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

నివేదికలు తయారు చేయని ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రైతులు నష్టపోయిన పంటల వివరాలను అధికారికంగా ప్రకటించడం లేదు. భారీగా కురుస్తున్న వర్షాలకు గతేడాది దాదాపుగా 5.6లక్షల ఎకరాల్లో పంట నష్టపోగా ఈ ఏడాది ఇప్పటి వరకే 5లక్షల ఎకరాల వరకు పంటలు నష్టపోయాయని అనధికారికంగా తెలుస్తోంది. రూ. వేల కోట్లలను రైతులు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది సీజన్ మొదట్లోనే భారీగా పంటలకు నష్టం వాటిల్లడంతో పంటలు ముగిసే నాటికి ఏ మేరకు నష్టాలు చూడాల్సి వస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్టం వివరాలు నమోదు చేయాలి..

పంట నష్టం వివరాలను నమోదు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ తీరుతో రైతాంగం 3 ఏళ్లుగా పంట నష్టం నిధులను అందుకోవడం లేదు. కేంద్రం నుంచి రావల్సిన నిధులను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నది. అధిక వర్షాలతో నష్టపోతున్న రైతులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని పంటనష్టం పరిహారాన్ని కూడా పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -సాగర్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed