సేఫ్ జోన్‌లో పుట్ట మధు..? మర్డర్ కథ కంచికేనా!

by  |
సేఫ్ జోన్‌లో పుట్ట మధు..? మర్డర్ కథ కంచికేనా!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు వ్యవహారం దాదాపుగా సద్దుమణిగినట్టేనని స్పష్టం అవుతోంది. పది రోజుల పాటు అదృశ్యమై ఆ తరువాత పోలీసులకు చిక్కి మూడ్రోజుల పాటు విచారణ ఎదుర్కొన్న పుట్ట మధుపై కేసు పెట్టే పరిస్థితి లేదని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్ట మధును కస్టడీలోకి తీసుకున్న రామగుండం కమిషనరేట్ పోలీసులు వరసగా మూడు రోజుల పాటు విచారించారు. సోమవారం రాత్రి ఇంటికి వెల్లిన మధును మంగళవారం మధ్యాహ్నం మళ్లీ హాజరు కావాలని పోలీసులు సూచించారు. దీంతో నాలుగో రోజు కూడా మధు రామగుండం కమిషనరేట్‌లో జరుగుతున్న విచారణకు హాజరయ్యారు. అయితే పుట్ట మధుకు హత్యకేసుతో సంబంధం ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు లేవని పోలీసులు నిర్దారించినట్టు సమాచారం. కాల్ రికార్డ్స్‌తో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు అన్ని కోణాల్లో ఆయన్ను ప్రశ్నించారు.

స్టేట్ మెంట్ రికార్డ్..

వామన్ రావు కపుల్స్ మర్డర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఆ హత్యలకు కారణం తాను మాత్రం కాదని, మర్డర్ గురించి ముందుగా తనకు ఏ మాత్రం తెలియదని పుట్ట మధు వివరించినట్టు సమాచారం. పుట్ట మధు ఇచ్చిన స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారని తెలుస్తోంది.

గందరగోళంలో కేడర్..

పుట్ట మధను మూడు రోజుల పాటు పోలీసులు విచారించినప్పటికీ నాలుగో రోజు కూడా విచారణకు హాజరు కావాలని కోరడంతో టీఆర్ఎస్ కేడర్‌లో కొంత గందరగోళం నెలకొంది. మూడు రోజులుగా విచారణ జరిపిన తర్వాత మళ్లీ పోలీసులు ఎందుకు పిలిచారన్న ఆందోళన మొదలైంది. అయితే తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు విచారణకు ఎన్నిసార్లు రమ్మన్నా వెళ్లీ తన సచ్ఛీలత ఏంటో నిరూపిస్తానని మధు తన సన్నిహితులతో అన్నట్టుగా తెలుస్తోంది. మధు మంథనికి చేరుకున్నాడన్న సమాచారం అందుకున్న వెంటనే నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు.


Next Story

Most Viewed