‘పసుపు’ చుట్టూ రాజకీయ కసువు

by  |
‘పసుపు’ చుట్టూ రాజకీయ కసువు
X

దిశ, నిజామాబాద్: రెండేళ్లుగా జిల్లా రాజకీయాలను పసుపు బోర్డు అంశం షేక్ చేస్తోంది. ఎన్నికలు అయిపోయి చాలారోజులు అవుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా పసుపు బోర్డు అంశాన్నే అనుకూలంగా మార్చుకుంటున్నాయి తప్ప రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదు. దీంతో రైతులు దిగాలు పడుతూ ఇక పసుపు పంటను సాగుచేయబోమనే పరిస్థితికి వచ్చారు. రెండేళ్ల నుంచి మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నా రూ.5 వేలకు మించి ధర రాకపోవడంతో ఉద్యమ బాట పడుతున్నారు. అంతర్జాతీయంగా పసుపు పంటకు మంచి డిమాండ్ ఉన్నా ఇక్కడ ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఇక పసుపు పంటను తమ తరానికే పరిమితం చేయాలనే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు.

ప్రపంచంలోనే పసుపు ఉత్పత్తిలో 80 శాతం ఇండియాలోనే సాగు అవుతోంది. భారత్, థాయిలాండ్, లాటిన్ అమెరికా పసుపును ఎగుమతి చేస్తే అందులో 60శాతం మనదే. ఇక్కడి నుంచి జపాన్, శ్రీలంక, ఇరాన్, యూఏఈ, అమెరికా, ఇంగ్లండ్, ఇథియోఫియా పసుపుని దిగుమతి చేసుకుంటాయి. ఇక దేశవ్యాప్తంగా గమనిస్తే తెలంగాణలోనే పసుపు పంటను అధికంగా పండిస్తారు. అందులో 32 శాతం వాటా నిజామాబాద్ జిల్లాదే. దేశంలో మొత్తం 47,760 హెక్టార్ల పసుపు పంట సాగైతే.. అందులో 17 వేల హెక్టార్లు నిజామాబాద్ జిల్లాలోనే పండిస్తున్నారు. ఎకరానికి రూ.లక్షా 20 వేల పెట్టుబడి అవుతుండగా 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బాగా పండితే 25 క్వింటాళ్ల వరకు రావొచ్చు. అయితే మద్దతు ధర రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే పరిమితం అవుతుండటంతో రైతులకు గిట్టుబాటు కావట్లేదు.

సూపర్‌ మార్కెట్లో 100 గ్రాముల పసుపు రూ.24కు దొరుకుతుంది. ఈలెక్కన కిలో పసుపు రూ.240 కాగా, క్వింటాలు పసుపు రూ.24 వేలవుతుంది. కానీ, రైతుకు మద్దతు ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలే అందుతుండటంతో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కేంద్రం స్పైస్ బోర్డు ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, విధి విధానాలు, బడ్జెట్ అంశాలు ప్రకటించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 9 నెలలు కష్టపడి సాగు చేస్తే ఎకరానికి 16 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, మార్కెట్ లో మాత్రం రూ.5 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

పసుపు పంట మొదలు పెట్టినప్పటి నుంచి దుక్కిదున్నడం, విత్తనాలు, ఎరువులు, కలుపు తీయడం, పంట చేతికొచ్చాక రిక్కడం, ఉడక బెట్టడం, మార్కెట్ తరలించేందుకు రవాణా ఖర్చుతో కలుపుకుంటే రూ.లక్షా 20 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రస్తుతం మార్కెట్‌లో యావరేజ్‌గా రూ.4 వేల మాత్రమే పలుకుతుండటంతో… 16 క్వింటాళ్ల దిగుబడి ఉన్న రైతుకు రూ.64 వేలు వస్తున్నాయని చెబుతున్నారు. 9 నెలలు కష్టపడి సాగు చేస్తే సగం నష్టం వస్తోందని రైతులు చెబుతున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన పొలంలో పసుపు పంటకు క్రాప్ హాలీడ్ ప్రకటించాడు. ఆయన బాటలోనే ఇతర గ్రామాలకు చెందిన 30 మంది రైతులు వచ్చే సీజన్‌లో పసుపు పంటను సాగు చేయడం మానేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై 90రోజుల్లో చేతికొచ్చే పంటలు సాగుచేసుకుంటామని అంటున్నారు.

Tags: Nizamabad, Yellow Board, Elections, India, Sri Lanka, Support Price, super market



Next Story

Most Viewed