ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా పని చేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

by  |

దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు విధించిన సడలింపులను ప్రభుత్వ కార్యాలయాల్లో ఎత్తివేస్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో గురువారం సెల్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు, ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో ని అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయాలని అన్నారు. రోజు 50 శాతం షాపులు తెరిచేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో వారికి జరిమానాలు విధించాలని చెప్పారు. ఉల్లంఘించిన వారిని సెల్ ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా సమిష్టిగా కృషి చేస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సులువవుతుందని అన్నారు. వేసవిలో తాగునీరుకు కొరత లేకుండా చూడాలని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కను కాపాడుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లో భాగంగా కొత్త పనులు మొదలు పెట్టకుండా మొదలైన పనులు పూర్తి చేయాలని అన్నారు. కోవిడ్ పనుల విషయం లో ఎటువంటి నిబంధనలు లేవని, నారేగా కింద జాబ్ కార్డ్ హోల్డర్లు అందరికి వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని అన్నారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్ మొదలుతున్నందున పక్కా ప్లానింగ్‌తో వ్యవసాయ పనులకు అవసరమైనవి సమకూర్చాలని సూచించారు. ప్రతి శాఖ తమ తమ పనులు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. కొవిడ్ సందర్భంగా ప్రత్యేక సేవలు అందించిన అగ్నిమాపక, అటవీశాఖ ఉద్యోగులు, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Tags: Nizamabad collector,Narayana reddy,relaxations,Pullout



Next Story