అన్‌లాక్ 3.0.. రాత్రుళ్లు కర్ఫ్యూ ఎత్తివేత

by  |
అన్‌లాక్ 3.0.. రాత్రుళ్లు కర్ఫ్యూ ఎత్తివేత
X

దిశ, న్యూస్ బ్యూరో:
కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం అన్‌లాక్-3 మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది. 24 గంటలూ ప్రజల కదలికలు, వాహనాల రాకపోకలకు వీలు కల్పించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తదితరాలు మాత్రం ఆగస్టు 31 వరకు మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఎంటర్‌‌టెయిన్‌మెంట్ కేంద్రాలు, పబ్‌లు, క్లబ్‌లు, బార్లు తదితరాలు కూడా మూసివేసే ఉంటాయని ప్రకటించింది. ఆగస్టు ఐదు నుంచి కొన్ని పరిమితులతో యోగా కేంద్రాలు, జిమ్‌లు పనిచేయవచ్చని పేర్కొంది. ఇందుకోసం కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ త్వరలోనే నిర్దిష్టమైన సూచనలు ఇస్తుంది. మెట్రో రైళ్లు, విదేశీ విమాన సర్వీసులు, రాజకీయ సభలు-సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలు, జనం ఎక్కువగా హాజరయ్యే కార్యక్రమాలకు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అనుమతి లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వివరించారు. పంద్రాగస్టు వేడుకలను పరిమిత ఆంక్షల నడుమ జరుపుకోవాలని సూచించారు. దేశ రాజధాని మొదలు పంచాయతీ కార్యాలయం వరకు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారంతా విధిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు సైతం పరిమితుల నడుమ, సోషల్ డిస్టెన్స్ నిబంధన మేరకు జరగాలని సూచించారు. కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసరాలు, నిత్యవసరాలకు మినహా సాధారణ ప్రజల కదలికలు ఉండవని, ఆగస్టు 31వ తేదీ వరకు ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు.

ఆన్‌లైన్ తరగతులను ప్రోత్సహించాలి..

ఆగస్టు 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థలు మూసివేసే ఉంటాయి కాబట్టి ఈ కాలంలో ఆన్‌లైన్ తరగతులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్ర హోం కార్యదర్శి పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ తరగతులను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కలెక్టర్ కంటైన్‌మెంట్ జోన్ల ప్రకటన, ఎత్తివేత లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చునన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలుచే యాల్సిందేనన్నారు. పేషెంట్ల ప్రైమరీ కాంటాక్టులను ట్రేస్ చేయాల్సిందేనని, ఇంటింటి సర్వే జరుపుతూ వైరస్ వ్యాప్తిపై నిఘా కొనసాగాల్సిందేనన్నారు. కంటైన్‌మెంట్ జోన్లకు వెలుపల ఉన్న బఫర్ జోన్లలో సైతం వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని, ఇలాంటిచోట్ల కూడా ఆంక్షలను అమలుచేయాలన్నారు.

అంతర్ రాష్ట్ర రాకపోకలకు ఆంక్షలు లేవు..

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలో జిల్లాల మధ్య తిరుగుతున్నట్లుగానే వాహనాల రాకపోకలు కొనసాగుతాయని, సరుకు రవాణాకు కూడా ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర హోం కార్యదర్శి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ చిక్కుకుపోయి ఉన్న వలస కార్మికులను సొంతూళ్ళకు తరలించడానికి ‘శ్రామిక్ ఎక్స్‌‌ప్రెస్’ రైలు సర్వీసులు, విదేశాల్లో చిక్కుకుపోయినవారిని తీసుకొచ్చేందుకు ‘వందే భారత్’ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు. పదేళ్ళ లోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ళ వయసు దాటిన వృద్ధులు వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇంటి గడప దాటి బైటకు వచ్చే ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాల్సిందేనని, అరడుగుల సోషల్ డిస్టెన్స్ నిబందనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed