Stock exchange: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..మొదట లాభం.. చివర్లో నష్టాలు!

by  |
Stock exchange: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..మొదట లాభం.. చివర్లో నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాలను కొనసాగించినప్పటికీ మిడ్-సెషన్ తర్వాత నెమ్మదిగా నష్టాల్లోకి జారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఉదయం లాభాలతో మొదలైన సూచీలు, అనంతరం మార్కెట్లు పుంజుకునే సంఘటనలేవీ లేకపోవడంతో నెమ్మదించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు దేశీయంగా కరోనా టీకా కొరత, బ్లాక్ ఫంగస్ అంశాలు మదుపర్లలో ఆందోళనను పెంచాయని విశ్లేషకులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ర్యాలీతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించినట్టు నిపుణులు భావిస్తున్నారు.

ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 14.37 పాయింట్లు కోల్పోయి 50,637 వద్ద ముగియగా, నిఫ్టీ 10.75 పాయింట్లు లాభపడి 15,208 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా ఇండెక్స్ అధికంగా 3.2 శాతం పుంజుకోగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియల్టీ ఇండెక్స్‌లు బలపడ్డాయి. బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్ ఇండెక్స్‌లు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఓఎన్‌జీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.79 వద్ద ఉంది.


Next Story

Most Viewed