న్యూజిలాండ్‌లో ఐపీఎల్ సాధ్యమేనా?

by  |
న్యూజిలాండ్‌లో ఐపీఎల్ సాధ్యమేనా?
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ నిర్వహణకు కరోనా వైరస్ అడ్డంకిగా మారింది. ఈ ఏడాది 13వ సీజన్‌ను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో బోర్డు ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లోనే అత్యధిక కొవిడ్ -19 కేసులు ఉన్న నేపథ్యంలో స్వదేశంలో ఐపీఎల్ నిర్వహణ దాదాపు అసాధ్యంగానే కనిపిస్తున్నది. మా దేశంలో ఐపీఎల్ నిర్వహించమని ఇప్పటికే యూఏఈ, శ్రీలంక క్రికెట్ బోర్డ్స్ బీసీసీఐకి లేఖలు రాశాయి. ఇప్పుడు ఈ జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరింది. అంతర్జాతీయ స్టేడియాలు, కరోనా ఫ్రీగా ఉన్న న్యూజిలాండ్‌కు ఐపీఎల్‌ను తరలించమని ఆ దేశ క్రికెట్ బోర్డ్ బీసీసీఐకి లేఖ రాసింది. అయితే, టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఐపీఎల్ భవిత్యం తేలనుంది. ‘ఐపీఎల్‌ను సాధ్యమైనంత వరకు ఇండియాలో నిర్వహించాలని భావిస్తున్నాం. యూఏఈ, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తామని ముందుకు వచ్చాయి. తాజాగా న్యూజిలాండ్ కూడా ఈ మెగా లీగ్ నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేసింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

కివీస్‌లో సాధ్యమా?

అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు, రవాణా సదుపాయాలు, స్టార్ హోటల్స్ ప్రకారం న్యూజిలాండ్ మంచి ఛాయిసే. అక్కడ కరోనా ప్రభావం లేదు. అయితే, న్యూజిలాండ్‌కు ఇండియాకు మధ్య 7.30 గంటల సమయం తేడా ఉంటుంది. అక్కడ మధ్యాహ్నం 12.30 మ్యాచ్ ప్రారంభించినా ఇండియాలో రెండో మ్యాచ్ ముగిసే సరికి అర్ధరాత్రి దాటిపోతుంది. ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లేవాళ్లు మ్యాచ్‌లు చూసే అవకాశం ఉండదు. మరోవైపు అక్కడ ఆక్లాండ్, హామిల్టన్‌ల మధ్య రోడ్డు మార్గం అనుకూలంగా ఉంటుంది. కానీ, వెల్లింగ్టన్, క్రైస్ట్ చర్చ్, నేపియర్, డునేదిన్ ప్రాంతాలకు తప్పకుండా విమాన ప్రయాణాలే చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎక్కువ ప్రయాణాలు చేయడం సాధ్యం కాని పని. మరోవైపు అక్కడ ఐపీఎల్ నిర్వహణకు స్టార్ ఇండియా ఒప్పుకుంటుందా అనేది కూడా మరో ముఖ్యమైన విషయం. ఇన్ని అవాంతరాల నడుమ బీసీసీఐ న్యూజిలాండ్‌లో ఐపీఎల్ అనే అంశాన్ని పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువ. మరోవైపు శ్రీలంకలో ఐపీఎల్ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని బీసీసీఐ అనుకుంటున్నది. ఇక మిగిలింది యూఏఈనే.

Next Story