టీఎస్ విద్యుత్ వినియోగంలో రోజుకో కొత్త రికార్డు….

by  |
టీఎస్ విద్యుత్ వినియోగంలో రోజుకో కొత్త రికార్డు….
X

హైదరాబాద్….తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజుకో కొత్త రికార్డు నమోదు చేసుకుంటోంది. ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం ఉదయం 7గంటల46 నిమిషాలకు రాష్ట్రంలో గరిష్ట వాడకం 12936 మెగావాట్లుగా నమోదైంది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన అత్యధిక విద్యుత్ వినియోగం ఇదే కావడం విశేషం. ఒక రోజులో ఏదో ఒక సమయంలో నమోదైన గరిష్ట వాడకాన్ని ఆ రోజు పీక్ డిమాండ్‌గా వ్యవహరిస్తారు. ఆ రోజుంతా నమోదైన డిమాండ్‌‌‌‌‌ల సగటును ఆ రోజు మొత్తం డిమాండ్‌గా నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఈ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో కోటికిపైగా ఎకరాల్లో పంటలు సాగవుతుండడం, ఎండాకాలం ప్రారంభంలోనే తీవ్రంగా వేడి ఉండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎప్పుడూ లేనంతగా నమోదవుతోంది. కాగా, రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అయిన టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లోనే అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లుండడం, ఈ డిస్కం పరిధిలోనే ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం అన్ని బ్యారేజీల వద్ద ఉన్న మోటార్లు పూర్తిస్థాయిలో రన్ అవుతుండడంతో రికార్డుస్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఈ డిస్కం పరిధిలో గత ఏడాది ఫిబ్రవరి 19నే కేవలం 3182 మెగావాట్ల డిమాండ్ నమోదవగా ఇది ఏకంగా 2400 మెగావాట్లు పెరిగి బుధవారం 5601 మెగావాట్లుగా నమోదైంది. ఇక తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అయిన టీఎస్ఎస్పీడీసీఎల్‌లో గత ఏడాది ఇదే రోజు 6097 మెగావాట్ల డిమాండ్ ఉండగా 850 మెగావాట్లుగా పెరిగి బుధవారం 6963 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ డిస్కం పరిధిలో హైదరాబాద్ పట్టణం ఉండడంతో గృహావసరాల వినియోగం పెరగడంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్‌లు పనిచేస్తుండడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. కాగా, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల రన్నింగ్‌కు బుధవారం ఒక్కరోజే గరిష్టంగా 1347 మెగావాట్లు వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాత విద్యుత్ వినియోగ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ విద్యుత్ వినియోగం రోజుకో కొత్త పీక్ వినియోగ రికార్డును నమోదుచేస్తుండడం విశేషం.

Next Story