గోవా, ముంబై తీరాల్లో జెల్లీఫిష్ సమస్య

by  |
గోవా, ముంబై తీరాల్లో జెల్లీఫిష్ సమస్య
X

దిశ, వెబ్‌డెస్క్ : పాండమిక్ కారణంగా ఇంటికి పరిమితమైన ట్రావెల్ ప్రియులందరూ ఈ నవంబర్, డిసెంబర్‌లో గోవా ప్లాన్ వేసుకున్నారు. అయితే ఇప్పటికే గోవా ట్రిప్ వేసుకుని, అక్కడ ఎంజాయ్ చేస్తున్నవారికి ఓ చేదు అనుభవం ఎదురవుతోంది. ఆ చేదు అనుభవానికి కారణం జెల్లీఫిష్‌లు. టూరిస్టులతో ఎప్పుడూ బిజీగా ఉండే గోవా బీచ్‌లకు ఇప్పుడు జెల్లీఫిష్‌లు సమస్యగా మారాయి. వచ్చిన టూరిస్టులను అవి కుడుతున్నాయి. దీంతో వారు అనారోగ్యం పాలవుతున్నారు. విషపూరిత జెల్లీఫిష్‌లు కుట్టడం వల్ల కొందరిలో శ్వాస సమస్యలు కూడా ఎదురై ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. గత రెండు మూడు రోజులుగా గోవాలోని పలు బీచ్‌లలో 60 నుంచి 70 మంది జెల్లీఫిష్ కాటుకు గురయ్యారు. దీంతో అక్కడికి వచ్చే టూరిస్టులకు సముద్రం నీళ్లలో సర్ఫింగ్ చేయొద్దని, కొన్ని చోట్ల అసలు నీళ్లలోకే దిగవద్దని షరతులు విధించింది.

ఇదే జెల్లీఫిష్.. ఇటు టూరిస్టులతో పాటు ముంబైలో చేపలు పడుతున్న జాలర్లను కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. చేపలు పట్టడానికి వలలు వేస్తే 80 నుంచి 90 శాతం ఈ జెల్లీఫిష్‌లే పడుతున్నాయి. వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తే కుడుతున్నాయి. దీంతో వలలు పాడవుతున్నాయని జాలర్లు అంటున్నారు. అయితే ఇలా వలల్లో జెల్లీఫిష్‌‌లు పడటం కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువగా పడుతున్నాయని, దీన్ని బట్టి చూస్తే చేపల సంఖ్య గణనీయంగా తగ్గిఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే అధిక ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా చేపలు చనిపోయి ఉండవచ్చని, ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలిగే జెల్లీఫిష్‌ల సంఖ్య వృద్ధి చెంది ఉండవచ్చని వారు వివరిస్తున్నారు.


Next Story

Most Viewed