ఇక్కడ మసీదు ఎందుకు?

by  |
ఇక్కడ మసీదు ఎందుకు?
X

యోధ్యకు 30 కి.మీ.ల దూరంలో లక్నో-గోరఖ్‌పూర్ హైవే మీద ధన్నిపూర్ గ్రామం ఉంది. ఆ దారిలో వెళ్లే వారు నిన్నటి వరకు ఆ గ్రామం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అక్కడ ఆగి మరీ విచారణ చేసి, వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమిలో రామ మందిరం నిర్మాణానికి మద్దతుగా తీర్పునివ్వడంతో ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణానికి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వారు ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించారు.

మరి సమస్యేంటి?

ధన్నిపూర్ గ్రామంలో నివసిస్తున్న వారిలో 60 శాతం మంది ముస్లింలు కాగా మిగతా వాళ్లలో ఎక్కువ మంది యాదవులు. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇప్పటికే మసీదులతో ఉన్న ప్రాంతంలో మళ్లీ కొత్త మసీదు ఎందుకని ఓ వర్గం ప్రశ్నిస్తున్నారు. కానీ ఇది భగవంతుని మీద నమ్మకం, విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి మసీదు తప్పనిసరిగా ఉండాలని మరో వర్గం వివరణ ఇచ్చుకుంటున్నారు.

ఈ గ్రామంలో, అలాగే పక్కనే ఉన్న రౌనహీ పట్టణంలో ఇప్పటికే అవసరానికి మించిన మసీదులు ఉన్నాయి. నమాజ్ సమయంలో కొన్ని మసీదులకు జనాలు కూడా రావట్లేరు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే స్థలంలో ఓ ఐటీఐ లేదా కళాశాల లేదా హాస్పిటల్ నిర్మిస్తే మంచిదని అక్కడి యువత అభిప్రాయపడుతోంది.

ఇదిలా ఉండగా మసీదు కోసం ఇచ్చిన భూమిలో మసీదు మాత్రమే నిర్మించాలని, కళాశాలలు, ఆసుపత్రులకు ఎక్కడైనా భూమి దొరుకుతుందని, ఇప్పుడు మసీదు నిర్మించకపోతే బాబ్రీ మసీదు అనే ఒక కట్టడం ఉందనే సంగతే జనాలు మర్చిపోతారని అక్కడి ముస్లిం పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం గుర్తించిన భూమిలో గోధుమలు పండించే వ్యవసాయ భూమి అని, అలాగే అక్కడ వందల ఏళ్ల నాటి షాగడ షా గుడి ఉందని, ఆ స్థానంలో మసీదు కట్టాలంటే గుడి తొలగించడం తప్పదని, అలా చేయడం సబబు కాదని కొందరు అంటున్నారు. అయితే గుడి ఎలాంటి నష్టం జరగకుండా మసీదు నిర్మాణ పనులను చేపడతామని జిల్లా అధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed