వరి ధాన్యం రైతులకు కొత్త చిక్కులు

by  |
వరి ధాన్యం రైతులకు కొత్త చిక్కులు
X

దిశ, లోకేశ్వరం: వరి ధాన్యం పండించడానికి నాలుగు నెలల పాటు రైతులు పడిన శ్రమ ఒక ఎత్తయితే.. ధాన్యం విక్రయించడానికి కర్షకులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనీసం అధికారులను ఏ మాత్రం కదిలించడం లేదు. దీనితో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం విక్రయించడానికి 15 నుండి నెల రోజుల వరకు రైతులు పడుతున్న అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి.

వరి పండించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారు.
ఏ భూమిలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగుచేస్తున్నారు? అనే వివరాలను సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సీజన్ ప్రారంభంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. కానీ చాలామంది ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కూర్చున్న చోటనే పంటల వివరాలు రైతుల నుండి సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల ధాన్యం పండించిన రైతులు అమ్ముకోవడం కోసం కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ధాన్యం విక్రయించే రైతు పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అందజేయాల్సి ఉంది. ఆ రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే.. రైతు మొబైల్ ఫోన్‌కు ఓటిపి వస్తుంది. దానిని నమోదు చేస్తేనే రైతు వివరాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతాయి. కానీ చాలామంది రైతులకు ఓటీపీ రావడం లేదు. ఎందుకంటే ఆ సర్వే నంబర్ లో వరి ధాన్యంకు బదులు ఇతర పంటలు సాగు చేసినట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.

ఇతర రైతుల పేర్లతో ధాన్యం విక్రయిస్తున్న రైతులు

రైతులకు గత్యంతరం లేక ఇతర రైతుల పేర్లతో ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ధాన్యం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సందర్భంలో.. ఎంత జమ అయ్యాయో స్పష్టత లేక పలు గ్రామాల్లో రైతుల మధ్య గొడవలు జరుగుతున్న సంఘటనలు నెలకొంటున్నాయి. ఇకనైనా అధికారులు రైతుల అవస్థలు గుర్తించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

రైతులు సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తాం: మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్

ధాన్యం పండించి ఆన్‌లైన్‌లో విస్తీర్ణం నమోదు కాని రైతులు సంబంధిత ఏఈఓను గానీ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో గానీ సంప్రదిస్తే సరిదిద్ది రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. అలాంటి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో వీలైనంత త్వరలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.

Next Story