నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లు కొత్త డ్రామా

by  |
Bhatti Vikramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తెలంగాణలో కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ సంగమేశ్వరం నుంచి నీరు తరలించేందుకు సంవత్సరం కిందటే జీవో ఇచ్చిందని, అయితే అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు టీఆరఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణకు చెందాల్సిన చుక్క నీటి బొట్టును కూడా వదులుకోమని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు సిద్ధమయ్యారని, అలా మొత్తం మీద రోజుకు 11 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని భట్టి తెలిపారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ల కోసమని, అయితే ఇన్నిరోజులు తాము చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు టీఆర్ఎస్ నేతల తీరుందని, కనీసం కుక్కలైనా ఆర్నెళ్లకు మోరుగుతాయి.. కానీ టీఆరెస్ ప్రభుత్వం, నేతలు ఏడాదికి మేలుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఆయన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోడని విమర్శించారు.

గతేడాది ఏప్రిల్ నుంచి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించాలని అధికారులు ఆదేశిస్తే ఆనాటి నుంచి ఒక్క టీఎంసీనే వినియోగించుకుంటున్నామని, మనకు రావాల్సిన నీళ్లను ఏపీకి తరలిస్తున్నారని భట్టి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ సంగమేశ్వరం పేరుతో నీళ్లను తరలించుకుపోతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు తీవ్రంగా నష్టపోతుందన్నారు. లెఫ్ట్ కెనాల్ రోజుకు ఒక్క టీఎంసీ పారితే.. ఇక్కడ 11 టీఎంసీలు తరలిపోతాయని ఆయన పేర్కొన్నారు.

ఇలా నీళ్లను అక్రమంగా తరలించుకుంటే పోతుంటే శ్రీశైలం నిండేదెప్పుడు, శ్రీశైలమే నిండకపోతే.. ఆ ప్రాజెక్టు మీద ఆధారపడ్డ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, భీమా, కోయిల్ సాగర్, ఎస్.ఎల్.బీ.సీ లు ఎప్పుడు నిండుతాయని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

28.50 లక్షల ఎకరాలకు నష్టం

ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుంటూ పోతే సాగర్ లెప్ట్ కెనాల్ కింద ఆయకట్టులో ఉన్న ఆరున్నల లక్షల ఎకరాలు కూడా ఎండిపోతాయని, ఇలా మొత్తం కలిపితే.. దాదాపు 28.50 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని భట్టి విక్రమార్క అన్నారు. దానికి తోడు హైదరాబాద్ కు మంచినీళ్లు వచ్చే అవకాశం కూడా ఉండదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి కమిటీ, అపెక్స్ కమిటీ మీటింగ్ కు ఎందుకెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అప్పటికే ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం పూర్తయిందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు నిద్ర లేచి డ్రామాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.

ఈ ఏడేళ్లలో కేసీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకారానికి కూడా నీళ్లు పారలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఇతర కొత్త ప్రాజెక్టుల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని భట్టి పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం తుపాకీ రాముడిలా ఊర్లు తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్ రెండు పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వాడితేనే కరోనా పోతుందని చెబుతున్నారని, అయతే ఆయన ట్రీట్ మెంట్ తీసుకున్న హాస్పిటల్ ఒక్కరోజులో రూ.28 లక్షలు ఎలా వసూలు చేస్తోందని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని, ఆయన నిర్లక్ష్యపు మాటలే వల్లే అధికారులు నిద్రపోయారని విమర్శలు చేశారు. ఇక హరీశ్ రావు మాటలకే పరిమితం తప్పా.. హామీల అమలు మాత్రం ఉండవన్నారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొస్తే అప్పుడు హామీలిస్తూ ప్రజలను మభ్య పెట్టడమే పనిగా కేసీఆర్ పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రికి అన్నీ ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే మిగతా గ్రామాల సంగతేంటని భట్టి ప్రశ్నించారు.


Next Story