పెళ్లైన 4 నెలలకే నవ వధువు ఆత్మహత్య.. ఆ ముగ్గురే కారణమా..?

by  |
Vanaja
X

దిశ, పెన్ పహాడ్ : ఎన్నో కలలతో అత్తారింటికి వెళ్లిన ఆమెకు నిరాశే ఎదురైంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త.. నవ వధువు అని కూడా చూడకుండా అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి తోడుగా అత్తామామలు కలవడంతో వారి పోరును తట్టుకోలేక పోయింది. మరోవైపు పుట్టింటికి భారం అవుతానేమోనని కలత చెందింది. పెళ్లైన నాలుగు నెలలకే తనువు చలించింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..

పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మట్టయ్య తన కూతురు వనజ(25)ను నాలుగు నెలల క్రితం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నే గ్రామానికి చెందిన కందుల చంద్రయ్య, నాగమణి కుమారుడు సురేష్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. అయితే వివాహం జరిగిన నాటి నుంచే భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వనజను శారీరకంగా, మానసికంగా వేధించారు. దీంతో తల్లిగారి ఇంటికి వచ్చిన వనజ సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను వెంటనే ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది. మృతురాలి తండ్రి మట్టయ్య ఫిర్యాదు మేరకు వనజ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed