నిశ్చితార్థ వేడుకలో గొడవ.. కత్తితో పొడిచి చంపేసిన పక్కింటి యువకుడు

by  |
Murder
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఆదివారం సాయింత్రం ఓ నిశ్చితార్థ వేడుకలో దారుణం జరిగింది. ఓ యువకుడు కత్తితో ఇద్దరిపై దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ నరేష్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొడ్డు కోటి కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం సాయంత్రం జరిగింది. ఫంక్షన్‌ జరుగుతుండగా పక్క ఇంటికి చెందిన అవుదొడ్డి సుజీ కుమారుడు అవుదొడ్డి గోపి (17) భోజనం చేసేందుకు వచ్చాడు. అక్కడ చిన్న గొడవ జరగడంతో ఆవేశంగా ఇంటికి వెళ్లి, కత్తి తీసుకొని వచ్చి వర్ధన్నపేట మండలం ల్యాబర్తికి చెందిన పంకు సమ్మయ్య, పంకు మల్లయ్యపై ఆకస్మాత్తుగా దాడి చేశాడు. కత్తి పోట్లతో కుప్పకూలిన ఆ ఇద్దరిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పంకు సమ్మయ్య (50) మృతి చెందగా, మల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేష్‌ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed