ఉత్తమ పంచాయతీలో.. కూర్చోవడానికి జాగ లేదు

by  |
panchayat building works
X

దిశ, బాల్కొండ: రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజక వర్గ పరిధిలోని ఆ జీపీ ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది. అయితే అక్కడ మాత్రం కనీసం కూర్చోవడానికి జాగ లేదు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన జీపీ పనులు నత్త నడకతో పోటీ పడుతుండడంతో ప్రతీ సారి చెట్ల కిందే పాలక వర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అసంపూర్తి భవన నిర్మాణం కుక్కలకు ఆవాసంగా మారుతోంది. త్వరిత గతిన పనులు చేపట్టడంలో సర్పంచ్​, పంచాయతీ పాలకవర్గ సభ్యులు అలసత్వం వహిస్తున్నారని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్లుగా నత్తనడకన..

భీమ్‌‌గల్‌‌ మండలం బాబానగర్‌‌ గ్రామ పంచాయతీ పరిస్థితి పేరు గొప్ప… ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. ఉత్తమ పంచాయతీగా ఎన్నికైన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు మాటలు నీటి మూటలే అయ్యాయి. గ్రామ పంచాయతీ భవన 2017 లో ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 13 లక్షల నిధులు మంజూరయ్యాయి. . భీంగల్ మండల కేంద్రానికి ఆనుకుని ఉండటంతో మున్సిపాలిటీలో విలీనం అయినా బాగుపడేది కావొచ్చని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమావేశాలు నిర్వహించి తీర్మాణాలు చేయాల్సి ఉంటుంది. నూతన పంచాయతీ రాజ్‌‌ చట్టం ప్రకారం ప్రతీ రెండు నెలలకొకసారి గ్రామ సభ నిర్వహించాలి. లేకుంటే సర్పంచ్‌‌ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే బాబానగర్ లో అద్దెకు తీసుకున్న గది ఇరుకుగా ఉండడంతో చెట్ల కిందే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ముఖ్యంగా మహిళలు అరకొర వసతులతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిదులు స్పందించి పంచాయతి భవన నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

పనులు త్వరగా పూర్తి చేయిస్తాం

బాబానగర్​గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్‌‌ కు ఆదేశాలు జారీ చేశాం. త్వరలో బిల్డింగ్‌‌ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూస్తాం. – రాజేశ్వర్‌‌, భీం‌గల్‌‌ ఎంపీడీవో

ఇబ్బందులు పడుతున్నారు..

మా ఊరికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరొచ్చినా ఊరిలోని చెట్ల కిందనే మీటింగ్‌‌ పెట్టుకుంటున్నారు. గ్రామ సభలు నిర్వహించేటప్పుడు ఎండొచ్చిన, వానొచ్చినా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పాలక మండలి, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణ పనును త్వరగా పూర్తి చేయాలి. – మంద సురేష్‌‌, గ్రామస్తుడు


Next Story

Most Viewed