ఆ ప్రాజెక్ట్ ఆధునీకరణ అంతేనా..?

by  |
ఆ ప్రాజెక్ట్ ఆధునీకరణ అంతేనా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కోట్‌పల్లి ప్రాజెక్టు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు కింద సమృద్ధిగా పంటలు పండేవి. ప్రస్తుతం ఆయకట్టుకు నీరందించే కాలువలు, తూములు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా రైతులు సాగు చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. కానీ కాల్వలకు గండ్లు, పూడుకుపోవడంతో ఆయకట్టు వరకు చేరకుండా సాగునీరు వృథాగా పోతోంది. కాగా, రాష్ర్ట ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనైనా ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయిస్తుందనే ఆశతో ఉన్న తాండూర్ నియోజకవర్గ రైతులకు నిరాశే మిగిలింది.

నీళ్లున్నా ప్రజయోజనం శూన్యం..

కోట్‌పల్లి ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. ఫలితంగా ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణపై చూపుతున్న ప్రేమలో ఒక్క శాతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలపై చూపిస్తే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోట్‌పల్లి ప్రాజెక్టు నేపథ్యం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి పెద్దేముల్ మండలంలో కోట్‌పల్లి ప్రాజెక్టుకు శంకుస్తాపన చేశారు. ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తిచేసి సాగు నీరు అందరించారు. ఈ ప్రాజెక్టు 24 అడుగులలోతు, 1784 ఎకరాల్లో విస్తరించి ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 1.572 టీఎంసీలు. కుడి, ఎడమ, బేబీ కెనాల్‌ అనే మూడు కాలువల ద్వారా 18 గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించారు. కుడి కాలువ కింద 8,100 ఎకరాలు, ఎడమ కాలువ, బేబీ కాలువల కింద 1,100 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ప్రారంభంలో కుడికాలువ కింద ధారూరు మండలంలోని నాగసమందర్‌, అల్లాపూర్‌, రుద్రారం, బూర్గుగడ్డ, గట్టెపల్లి గ్రామాలు ఉన్నాయి. ఎడమ కాలువ కింద పెద్దేముల్‌ మండలంలోని మన్‌సాన్‌పల్లి, మారెపల్లి, దుగ్గాపూర్‌, రుక్మాపూర్‌, కొండాపూర్‌, ఖానాపూర్‌, రేగొండి, మదనంతాపూర్‌, జనగాం, మంబాపూర్‌, తింసాన్‌పల్లి, బుద్దారం, పెద్దేముల్‌, గ్రామాలు ఉన్నాయి. బేబీ కెనాల్‌ కింద నాగసమందర్‌, బూర్గుగడ్డ సగభాగం, ఎడమకాలువ కింద రుద్రారం, గట్టెపల్లి సగభాగం నీరు అందేది. ప్రస్తుతం ఈ గ్రామాల్లో చాలా ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు.

ఆచరణ శూన్యం..

వికారాబాద్‌ జిల్లాలో ఏకైక సాగు నీటి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయకట్టు సామర్థ్యం తగ్గుతోంది. కల్వర్టులు, తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక చోట్ల కాలువలు పూడుకుపోయాయి. దీంతో సాగు నీరు విడుదల చేసినప్పుడు చివరి ఆయకుట్టకు వరకు చేరాల్సిన నీరు చాలా చోట్ల కాల్వలు గండ్లు పడడం, పూడుకుపోవడం వల్ల వృథాగా పోతోంది. 9,200 ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మొదట ప్రాజెక్టు నుంచి రబీ సీజన్‌లో నీరు వదలకుండా వానాకాలం సీజన్‌లో 7500 ఎకరాలకు నీరందించారు. ఆ తరువాత 1996 నుంచి బుద్దారం, తింసాన్‌పల్లి గ్రామాల పరిధిలోని 1,100 ఎకరాలకు సాగునీటిని అందించలేమని ఆయకట్టు నుంచి తొలగించారు. అనంతరం ఆరుతడి పంటలు సాగుచేసే 4,600 ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలిగారు. ప్రస్తుతం 4 వేల ఎకరాలకు కూడా సక్రమంగా నీరందంచలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రతిపాదనలకే పరిమితం..

ఈ ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఏడేండ్ల క్రితం ప్రతిపాదనలు రూపొందించారు. సుమారుగా రూ.29 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా)కు ఆర్థిక సాయం కోసం పంపించింది. తిరిగి మూడేండ్ల కింద రూ.100 కోట్లతో ఆధునికరిస్తామని జైకాకు ప్రతిపాదనలు పంపించింది. కానీ ఇప్పటి వరకు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై మక్కువ చూపిస్తున్న సీఎం కేసీఆర్ కోట్‌పల్లి ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శస్తున్నారు.

వేరుశనిగ పంటకు ఆధారణ

కోట్‌పల్లి ప్రాజెక్టు ఆయకట్టులో వేరుశనిగ పంటకు ఆధారణ ఉండేది. ఈ పంటతో అధిక లాభాలు వచ్చేవి. ప్రస్తుతం కాలువలు, తూములు శిథిలావస్థకు చేరడంతో పంటలకు నీరందడం లేదు. దీంతో నష్టాలు వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ప్రాజెక్టు నిండినా ప్రయోజనం లేకుండా పోయింది. వృథాగా ప్రవహించడంతో పంటలకు నీరందడం లేదు. –బసిరెడ్డి, రైతు, పెద్దేముల్

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే..

ప్రభుత్వానికి రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలపై ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. పెద్దగా ప్రాజెక్టులు లేని జిల్లా అంటే వికారాబాద్. అలాంటిది జిల్లాలో ఉన్న ఏకైక ప్రాజెక్ట మరమ్మతులకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫలితంగా సాగుకు దూరమైయ్యే పరిస్థితి వచ్చింది. –అంజిలప్ప, రైతు, పెద్దేముల్

Next Story

Most Viewed