ప్రకృతి విధిస్తున్న లాక్‌డౌన్?

by  |
ప్రకృతి విధిస్తున్న లాక్‌డౌన్?
X

అప్పట్లో వరుసగా 15 రోజుల పాటు వర్షం కురిసేదని, బయటికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండేదని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇప్పటి యువతరం అలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూసి ఉండరు. వర్షం వస్తే మహా అయితే ఒక రెండు గంటలు, అదే ముసురు పడితే ఒక రెండు రోజులు.. అది కూడా మధ్యమధ్యలో గ్యాప్‌ ఇస్తూ, కాసేపు ఎండ కాస్తూ ఉండేది. కానీ గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి రావడం లేదు. ఒక్క నిమిషం.. ఇక్కడ ‘బయటికి రావడం లేదు’ అనే వాక్యం చాలా తెలిసిన వాక్యంలాగా అనిపిస్తోంది కదా! అవును గత నాలుగు నెలలుగా ప్రభుత్వాలు ఇదే మాటను చెబుతున్నాయి. కానీ ఎవరూ వినలేదు. కరోనా అంటే కనీసం భయం లేకుండా తిరుగుతున్నారు. వారిని నిరోధించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరడం లేదు. అందుకే వాళ్లెవరూ బయటికి రాకుండా ప్రకృతే ఈ వర్షాల రూపంలో లాక్‌డౌన్ విధించిందని అనొచ్చా?

దశావతారం సినిమా చూసిన వారికి ప్రకృతి పవర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్‌ను నిర్వీర్యం చేయడానికి ప్రకృతి సునామీ రూపంలో వస్తుంది. మరి ఈ కరోనా వైరస్‌ను వ్యాపించకుండా చేయడానికే ఈ వానలు వచ్చాయనిపిస్తోంది. ఎలాగూ రష్యా వారి వ్యాక్సిన్.. భారతదేశం వచ్చే వరకు కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దాన్ని కట్టడి చేయలేకపోతే అది ఎక్కువగా వ్యాపించి ఎలాంటి మందునైనా తట్టుకోగల శక్తిని పెంపొందించుకుని మరింత కష్టంగా మారవచ్చు. కానీ కట్టడి చేయాలంటే అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్లాలనే నిబంధన పాటించాలి. కానీ ఎవరూ వినలేదు. ఇప్పుడు వర్షానికి అత్యవసరమున్నా బయటికి వెళ్లలేకపోతున్నారు. నిజంగా ఇది ప్రకృతి ఆటేనా?

కరోనా గ్రామాలకు పాకిందని చెప్పుకుంటున్నాం. అదే గ్రామాల్లో ఇప్పుడు వరద హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ పుణ్యమాని అన్ని గ్రామాల్లోని చెరువులు నీళ్లతో కళకళలాడాయి. ఇప్పుడు ఆ నీళ్లకు ఈ ఎడతెరిపి లేని వాన నీళ్లు తోడయ్యాయి. దీంతో వాగులు పొంగిపోతున్నాయి. ఊర్లో ఉన్న యువత మొత్తం చేపల కోసం అక్కడికి వెళ్తున్నారు. కానీ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోట్లేదు. ఇక ప్రకృతి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వరుస కడుతుండటం చూస్తుంటే ఈ 2020 సంవత్సరం నిజంగానే దురదృష్టకరమైనదేనని అనక తప్పని పరిస్థితి!



Next Story

Most Viewed