భారత్‌కు యువతే బలం, బలగం: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 05:44:17  IST  )

భారత్‌కు యువతే బలం, బలగం: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశానికి యువతే బలం, బలగమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను ఆయన ప్రారంభించారు. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, 500లకు పైగా టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని తెలిపారు. ప్రపంచంలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోందని కామెంట్ చేశారు. ఏఐకి కేంద్రంగా ఇండియా రూపాంతరం చెందుతోందని అన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా ఉందన్నారు. మానవుల సామర్థ్యాన్ని ఏఐ మరింత పెంచుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేస్తోందనేది కాదని.. ఇప్పుడు ఏఐ‌తో మనం ఏం చేస్తున్నామనేది ముఖ్యమని పేర్కొన్నారు.

దక్షిణాసియాకే గర్వకారణం..

ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్కే కాదు, దక్షిణాసియాకే గర్వకారణమని ప్రధాన మోడీ అన్నారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోందని అన్నారు. ఏఐ సదస్సు మేడిన్ ఇండియా, భారత్ సృజనకు వేదికగా నిలిచిందని కొనియాడారు. ఈ సదస్సు భారతీయ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తుందని అన్నారు. ఏఐలో విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశామని, వికాసాన్ని చూశామని, ఏఐ కూడా అంతేనని అన్నారు. ఏఐ కత్తి రెండు వైపులా పదునున్న అస్త్రమని కామెంట్ చేశారు. భారత్‌కు యువత కొత్త శక్తిగా, ఆస్తిగా మారారని కితాబిచ్చారు. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలి..

ఏఐ మెషీన్ సెంట్రిక్గా కాదని.. హ్యుమన్ సెంట్రిక్గా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. పారదర్శకత్వమే అన్నింటి కంటే ఉత్తమమైన రక్షణ కవచమని ప్రధాని చెప్పుకొచ్చారు. మేడిన్ ఇండియా, భారత్ ఆవివష్కరణల సామర్థ్యం ఏఐ సదస్సు చాటుతోందని అన్నారు. ఏఐ సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉందని తెలిపారు. మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలని.. భారత్ ఏఐ పురోభివృద్ధికి ఓ చరిత్రగా నిలుస్తోందని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు.

Next Story