డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లలోని గజిబిజి రాతలపై హైకోర్టు కీలక ఆదేశాలు

by Dishanational4 |
డాక్టర్ల  ప్రిస్క్రిప్షన్లలోని గజిబిజి రాతలపై హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : డాక్టర్ల రాత.. బ్రహ్మ రాత ఎవరికీ అర్ధం కాదని అంటుంటారు. వైద్యుల మెడికల్ ప్రిస్క్రిప్షన్లపై రాతలు ఆవిధంగా గజిబిజిగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడంలో న్యాయవాదులు, జడ్జీలు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీనిపై ఒడిశా హైకోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ‘‘మెడికల్ ప్రిస్క్రిప్షన్లు, పోస్ట్‌మార్టం నివేదికలు, మెడికో లీగల్ డాక్యుమెంట్లను క్యాపిటల్ లెటర్‌లలో లేదంటే స్పష్టంగా అర్ధమయ్యేలా రాయడం మంచిది. దీనిపై రాష్ట్ర వైద్యులందరికీ ఆదేశాలు జారీ చేయండి’’ అని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డాక్టర్ల గజిబిజి రాతలను అర్థం చేసుకోలేక జడ్జీలు ఇబ్బందిపడాల్సి వస్తోందని హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీబ్ కుమార్ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు. పోస్టుమార్టం నివేదికల వంటి మెడికో లీగల్ డాక్యుమెంట్లపై ఉండే గజిబిజి రాతలు ఉంటే వాటిని జడ్జీలు చదివి అర్థం చేసుకొని ఒక అభిప్రాయానికి రావడం కష్టతరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

అసలు కేసు ఇదీ..

రసానంద భోయ్ అనే వ్యక్తి తన కుమారుడు పాము కాటుతో చనిపోయినందుకు పరిహారం అందించేలా ఒడిశా రాష్ట్ర సర్కారును ఆదేశించాలని కోరుతూ రిట్ పిటిషన్ వేశాడు. రసానంద భోయ్ కుమారుడు పాముకాటు వల్లే చనిపోయాడని పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యుడు వర్చువల్ మోడ్‌లో కోర్టుకు చెప్పాడు. అయితే ఆ డాక్టర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టును న్యాయమూర్తి అర్థం చదివి చేసుకోలేకపోయారు. పాముకాటు వల్లే మరణం సంభవించిందని చివరకు నిర్ధారించారు. ఎవరికీ అర్ధం కాని రాతలు రాయడం కొందరు డాక్టర్లకు ఫ్యాషన్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించిన జడ్జి జస్టిస్ సంజీబ్ కుమార్ పాణిగ్రాహి.. మెడికల్ రిపోర్టులు కుదిరించి రాసేలా డాక్టర్లకు మార్గదర్శకాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. కాగా, పరిహారం కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయాలి పిటిషనర్‌ రసానంద భోయ్‌కు సూచించారు.


Next Story