మహిళా మంత్రి మీటింగ్‌కు డుమ్మా.. IAS అధికారిపై ఏకంగా సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |

మహారాష్ట్రలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి మీటింగ్ హాజరు కాలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారరి సస్పెన్షన్ వేటు పడింది.

మహిళా మంత్రి మీటింగ్‌కు డుమ్మా.. IAS అధికారిపై ఏకంగా సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పర్యావరణ శాఖ మంత్రి పంకజా ముండే (Pankaja Munde) పిలిచిన సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టారని, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ దేవేంద్ర సింగ్, జాయింట్ డైరెక్టర్ సతీష్ పద్వాల్లను సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ వేదికగా సంచలన నిర్ణయం..

చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలోని కాలుష్య నివారణ చర్యలపై శాసనసభలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాను పిలిచిన బ్రీఫింగ్ సమావేశాలకు ఎంపీసీబీ (MPBC) అధికారులు వరుసగా గైర్హాజరవుతున్నారని మంత్రి పంకజా ముండే సభ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సమన్వయ లోపం వల్ల ప్రజా సమస్యలపై సమాధానం చెప్పడం ఇబ్బందిగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మంత్రి ఫిర్యాదుపై ప్రోటెమ్ స్పీకర్ దిలీప్ లాండే (Dilip Lande) తీవ్రంగా స్పందించారు. ప్రజాప్రతినిధులు పిలిచిన సమావేశాలకు రాకపోవడం అనేది సభా మర్యాదను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇది ప్రజలను అవమానించడంతో సమానమని ప్రోటెమ్ స్పీకర్ దిలీప్ లాండే వ్యాఖ్యానించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సభ జరుగుతుండగానే సదరు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించారు.

మరోవైపు సస్పెన్షన్ వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీసీబీ విభాగం ప్రస్తుతం శివసేన షిండే వర్గం నేత సిద్ధేష్ కదమ్ (Siddhesh Kadam) ఆధ్వర్యంలో ఉండగా.. పర్యావరణ శాఖ మంత్రిగా బీజేపీ నేత పంకజా ముండే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిత్రపక్షాల మధ్య సమన్వయ లోపం అధికారుల సస్పెన్షన్ వరకు దారితీసిందని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ (Sudhir Mungantiwar) ఐఏఎస్ అధికారిపై ప్రివిలేజ్ మోషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Next Story