ఖబడ్దార్.. ప్రజాధనాన్ని లూటీ చేస్తే.. తిరిగి కక్కిస్తా : మోడీ

by Dishanational4 |
ఖబడ్దార్.. ప్రజాధనాన్ని లూటీ చేస్తే.. తిరిగి కక్కిస్తా : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రజా సంక్షేమం కోసం వాడాల్సిన ధనాన్ని తమిళనాడులోని అధికార డీఎంకే లూటీ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అలాంటి డబ్బులన్నీ తిరిగి కక్కించి.. ప్రజల కోసం వెచ్చిస్తామని ఆయన తేల్చి చెప్పారు. చెన్నైలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అకౌంట్లలో మేం నేరుగా డబ్బులను జమ చేస్తున్నాం..ఇదే డీఎంకే వాళ్లకు పెద్ద సమస్యగా మారింది. ప్రజల సొమ్ములను వాళ్లు లూటీ చేసే ఛాన్స్ లేకుండా చేశాం’’ అని ఆయన తెలిపారు. ‘‘తమిళనాడులో గత డిసెంబర్‌లో తుఫాను వచ్చినప్పుడు ప్రజల కోసం ఫుడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన డీఎంకే సర్కారు.. మీడియా మేనేజ్మెంట్ చేసింది’’ అని ప్రధాని ఆరోపించారు. తద్వారా ప్రజలకు సాయపడడానికి బదులుగా కొత్త సమస్యలను డీఎంకే సర్కారు సృష్టించిందని మండిపడ్డారు. ఇళ్లల్లోకి నీళ్లు చేరుకుంటే అంతా సజావుగానే ఉందని డీఎంకే బుకాయిస్తూ వచ్చిందన్నారు. తమిళనాడులో బీజేపీ పాపులారటీ పెరుగుతోందని మోడీ పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఇది మోడీ గ్యారెంటీ అని తెలిపారు.



Next Story

Most Viewed