కేరళ: ఆధిక్యంలో యూడీఎఫ్.. సీఎం పోస్టు కోసం కాంగ్రెస్ నేతల మధ్య పోటీ

by Prasad Jukanti |

కేరళ: ఆధిక్యంలో యూడీఎఫ్.. సీఎం పోస్టు కోసం కాంగ్రెస్ నేతల మధ్య పోటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటర్లు ఊహించని రీతిలో తమ తీర్పు వెలువరించారు. కేరళలో రెండు దఫాల ఎల్‍డీఎఫ్ అధికార జోరుకు బ్రేకులు వేస్తూ ఓటర్లు తమ గత సాంప్రదాయానికే తిరిగి వెళ్లారు. అధికార మార్పుకు సై అంటూ యూడీఎఫ్ కూటమి మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఎల్‍డీఎఫ్ 42, యూడీఎఫ్ 95, ఎన్డీయే 3 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. అధికారం ఏర్పాటు దిశగా యూడీఎఫ్ ముందంజలో ఉండటంతో కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

సీఎం పోస్టు కోసం కాంగ్రెస్‍లో పోటీ:

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. దీంతో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. సీఎం రేస్‍లో కేరళ ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ నేత వి.డి. సతీశన్ (VD Satheesan), మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో కూటమిలో యూడీఎఫ్‌లో కీలక భాగస్వామిగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అధినేత పాణక్కాడ్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ సైతం సతీశన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం చేత సీఎం పోస్టు కేసీకే దక్కబోతోందనే చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ పేరుతో కేరళలో పోస్టర్లు సైతం వెలువడం హాట్ టాపిక్ గా మారింది.

తెరపైకి శశిథరూర్?:

ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కాంగ్రెస్ మరో సీనియర్ నేత శశిథరూర్ పేరు సైత్ వినిపిస్తోంది. అయితే గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల శశిథరూర్ వ్యవహరించిన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉందనే చర్చ జరుగుతోంది. బీజేపీ, మోడీ విధానాలను పలు సందర్భాల్లో ప్రశంసించిన శశిథరూర్ పట్ల హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శశిథరూర్‍కు సీఎం ఆశలకు అధిష్టానం ఆశీస్సులు ఉంటాయా అనేది అనుమానం కలిగించే అంశమే. ఇక కూటమిలో ఉన్న ముస్లిం లీగ్ నేతలు సీఎం పదవి తమకు ఇవ్వాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కొద్ది గంటల్లో కేరళ ప్రజల తీర్పు రాబోతోంది. దీంతో ఆ రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లు నడిపించే నాయకుడు ఎవరనే దానిపై స్పష్టత రానుంది.

Next Story