ప్రపంచంలో ప్రతి అంశాన్నీ ఆయుధంగా మార్చే ప్రయత్నాలు: జైశంకర్

by Phanindra |

ప్రపంచంలో ప్రతి అంశాన్నీ ఆయుధంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలో ప్రతి అంశాన్నీ ఆయుధంగా మార్చే ప్రయత్నాలు: జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి అంశాన్నీ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఆరావళి సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికపై చాలా తక్కువ కాలంలోనే మానవ కార్యకలాపాల్లో భారీ మార్పులు వచ్చాయని చెప్పిన ఆయన.. వీటి వల్ల వాణిజ్యం, సాంకేతికత, ఎనర్జీ, చివరకు యుద్ధతంత్రంలో కూడా పెనుమార్పులు సంభవించాయన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచం సర్దుకుపోవడం కన్నా పోటీ తత్వాన్నే ఎక్కువగా చూస్తోందని, దీంతో సహకారం కన్నా ఎక్కువగా వివిధ ఆసక్తుల మధ్య పోటీనే పెరుగుతోందని జైశంకర్ అన్నారు.

ఈ క్రమంలో దొరికిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో ప్రపంచం పూర్తిగా మారిపోతోందని ఆయన వివరించారు. సాంకేతిక మానిప్యులేషన్‌తో సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే వరకు ఎదిగిన పరిస్థితుల్లో.. అంతర్జాతీయ నిబంధనలు, పాలన వ్యవస్థలను ఇష్టమొచ్చినట్లు మార్చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో అసలు వాటిని పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆర్థిక నిర్ణయాల్లో కేవలం ధరను మాత్రమే చూసే రోజులు పోయాయని, ఓనర్‌షిప్, భద్రత కూడా కీలకంగా మారాయని వివరించారు. ప్రపంచంలో చాలా చోట్ల యాంటీ-గ్లోబలైజేషన్ సెంటిమెంట్ పెరిగిపోతోందని, వాణిజ్య నిర్ణయాలను అస్థిరమైన సుంకాలు ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.

విదేశాంగ విధానంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా జైశంకర్ వివరించారు. ‘మనకు చాలా పొరుగు దేశాలున్నాయి. కొన్ని మిగతా వాటి కంటే బెటర్. మంచిది కాని పక్కదేశాన్ని, మనల్ని ఒకే గాడికి కట్టేయకూడదంటే.. అవతలి వారికి శక్తి, సామర్థ్యం లేకుండా చేయాలి’ అని ఆయన చెప్పారు. పాక్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు నిపుణులు అంటున్నారు. అలాగే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలంటే ఐడియాలు, టర్మినాలజీలు, వాదనలు సృష్టించాలని జైశంకర్ సూచించారు. భారత దేశ ఎదుగుదల డిమాండ్, డెమోగ్రాఫిక్స్, డేటాతో ముందుకు సాగుతోందని, దీనిలో విద్యార్థులు కూడా భాగస్వాములవ్వాలని సూచించారు.

Next Story