మేము ఏ తప్పూ చేయలేదు: గడ్కరీ నోటీసులపై జైరాం రమేశ్ స్పందన

by Dishanational2 |
మేము ఏ తప్పూ చేయలేదు: గడ్కరీ నోటీసులపై జైరాం రమేశ్ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌లకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంపిన నోటీసులపై జైరాం రమేశ్ స్పందించారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గడ్కరీ పంపిన నోటీసులు తమకు అందాయని తెలిపారు. దీనికి త్వరలోనే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. వారు మాట్లాడిన మాటలనే షేర్ చేశామని, దానికి గడ్కరీ ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ హయాంలో దేశంలోని పేదలు, నిరుద్యోగులు అనేక బాధలు పడుతున్నారని తెలిపారు. కాగా, గడ్కరీ మాట్లాడిన ఓ 19 సెకన్ల వీడియోను కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా..అది తన పరువుకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ గడ్కరీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

గడ్కరీ బీజేపీ ఆస్తి: చంద్రశేఖర్ బవాన్ కులే

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడిన మాటలను మల్లికార్జున్‌ ఖర్గే, జైరామ్‌ రమేశ్‌లు షేర్ చేయడంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాన్‌కులే కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గడ్కరీ బీజేపీ ఆస్తి అని పేర్కొన్న ఆయన.. దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నితిన్ పనిచేస్తున్నారని తెలిపారు. ‘కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేసిన వీడియోను బీజేపీ ఖండిస్తుంది. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం వల్ల మా పార్టీలో అసంతృప్తి నెలకొంటుందని కొందరు భావిస్తున్నారు. అందుకే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడ్డారు. కానీ ప్రజలు అలాంటి వ్యక్తులను విడిచిపెట్టరు’ అని పేర్కొన్నారు. మోడీని ఢీకొనే సత్తా లేకనే అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.


Next Story