అభిషేక్ అభ్యర్థిత్వం వల్లే క్రాస్ ఓటింగ్ చేశాం: హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజిందర్ రాణా

by Dishanational2 |
అభిషేక్ అభ్యర్థిత్వం వల్లే క్రాస్ ఓటింగ్ చేశాం: హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజిందర్ రాణా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసిన విషయం తెలిసిందే. వారిపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు సైతం వేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజిందర్ రాణా స్పందించారు. అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకు పోటీకి దింపడం వల్లే తాము క్రాస్ ఓటింగ్ చేశామని ఆరోపించారు. హిమాచల్ గౌరవాన్ని నిలబెట్టేందుకే బీజేపీకి ఓటు వేశామన్నారు. పార్టీ నిర్మాణానికి సహకరించిన కార్యకర్తల్లో రాజ్యసభకు అర్హత పొందే అభ్యర్థులే లేరా అని సీఎం సుఖును ప్రశ్నించారు. అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు, సీఎం సుఖ్వింధర్ సుఖూ స్నేహితుల ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలుసు. యువత పరీక్షలు రాసి రోడ్లపైకి వస్తున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యేలను ఎక్కడి కక్కడ ప్రజలు నిలదీస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ..ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed