కోల్‌కతాలో కుప్పకూలిన వేర్‌హౌస్ పైకప్పు.. శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు

by Kema Shiva Kumar |

కోల్‌కతాలోని తారాటోలాలో పెను ప్రమాదం సంభవించింది.

కోల్‌కతాలో కుప్పకూలిన వేర్‌హౌస్ పైకప్పు.. శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata)లోని తారాటోలా పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ భారీ వేర్‌హౌస్ పైకప్పు (Roof) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోపల పెద్ద సంఖ్యలో కార్మికులు పనులు చేస్తున్నట్లు సమాచారం. శిథిలాల కింద దాదాపు 30 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

ఒక్కసారిగా కూలిన భారీ పైకప్పు..

పోలీసుల కథనం ప్రకారం.. తారాటోలా (Taratol)లోని ఒక గిడ్డంగిలో ఇవాళ ఉదయం కార్మికులు తమ రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో భవనానికి సంబంధించిన భారీ పైకప్పు భాగం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడింది. లోపల ఉన్న కార్మికులకు కనీసం బయటకు తప్పించుకునే సమయం కూడా దొరకలేదు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో, భారీ ఎత్తున కాంక్రీట్, ఇనుప పిల్లర్ల శిథిలాలు కింద పడ్డాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే కోల్‌కతా సిటీ పోలీసులు, ఫైర్ సిబ్బంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నాయి. శిథిలాలు భారీగా ఉండటంతో వాటిని తొలగించడానికి గ్యాస్ కట్టర్లు, క్రేన్లను రంగంలోకి దించారు. లోపల చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా ప్రాణాలతో బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story