- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ అంత్యక్రియలకు రావాలంటూ ఇరాన్ పిలుపు.. మోడీ హాజరవుతారా?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని మోడీకి ఇరాన్ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియకు ఆ దేశం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 5 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనంతరం 9వ తేదీన ఖమేనీ స్వస్థలం మషాద్లో ఆయనను ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దౌత్య వర్గాలు బుధవారం వెళ్లడించగా దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టిన మొదటి రోజే ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీతో పాటు మరో 40 మంది అత్యున్నత స్థాయి అధికారులు మృతి చెందారు. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు మనవరాలు సైతం మృతి చెందారు.
మోడీ హాజరుపై సస్పెన్స్:
ఈ కార్యక్రమానికి మోడీ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఖమేనీ మరణించినప్పుడు తొలుత భారత ప్రభుత్వం ఎలాంటి అధికారిక సంతాపం ప్రకటించలేదు. ఆ తర్వాత రాయబార కార్యాలయానికి సంతాప సందేశం పంపించింది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ తన చివరి అధికారిక ద్వైపాక్షిక ఇరాన్ పర్యటనను మే 2016లో చేశారు. ఆ పర్యటనలో ఆయన చాబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి ఖమేనీ, అప్పటి అధ్యక్షుడు హసన్ రౌహానీని కలిశారు. రెండు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 2018లో మోడీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు రౌహానీ భారతదేశ పర్యటనకు వచ్చి న్యూఢిల్లీ, హైదరాబాద్లలో పర్యటించారు. 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీ, పెజెష్కియన్లు చివరిసారిగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే ప్రధాని మోడీ, పెజెష్కియన్ను భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. తాజాగా ఖమేనీ అంత్యక్రియలకు తమ ప్రతినిధిని ఎంపిక చేసే విషయంపై భారతదేశం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని న్యూఢిల్లీ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.






