టీఆర్ఎఫ్‌కు ఉగ్రవాద సంస్థ ముద్ర.. పాక్‌కు పరోక్ష సందేశమా?

by Phanindra |

ఎల్‌ఈటీ అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా యూఎస్ గుర్తించడం పాక్‌కు పరోక్ష సందేశమేనని నిపుణులు అంటున్నారు.

టీఆర్ఎఫ్‌కు ఉగ్రవాద సంస్థ ముద్ర.. పాక్‌కు పరోక్ష సందేశమా?
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి వెనకున్న ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా యూఎస్ గుర్తించింది. ఈ ప్రకటనను భారత్ స్వాగతించింది. ఫిబ్రవరిలో యూఎస్‌ పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లొచ్చిన తర్వాత 26/11 ముంబై ఉగ్రదాడులు, పఠాన్‌కోట్ దాడుల్లో న్యాయం చేయాలని పాకిస్తాన్‌పై యూఎస్ కూడా ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే తహవ్వుర్ రాణాను కూడా భారత్‌కు యూఎస్ అప్పగించింది.

ఇప్పుడు టీఆర్ఎఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించడం పరోక్షంగా పాక్‌కు సందేశం ఇవ్వడమేనని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు టీఆర్ఎఫ్ కూడా లష్కర్-ఎ-తాయిబాలోనే భాగం. అయితే అంతర్జాతీయంగా ఎల్‌ఈటీని ఉగ్రసంస్థగా గుర్తించిన నేపథ్యంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) దృష్టి నుంచి తప్పించుకునేందుకే ఎల్ఈటీకి సంబంధించిన ఈ వింగ్‌ను టీఆర్ఎఫ్‌ రీబ్రాండ్ చేసినట్లు సమాచారం.

టీఆర్ఎఫ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా భారత్‌పై ఆగ్రహంతో ఉద్యమం చేస్తున్న కశ్మీరీల బృందం అని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాక్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు దీన్ని కూడా అంత్జాతీయ ఉగ్రసంస్థగా యూఎస్ ప్రకటించడంతో పాక్ పప్పులు ఉడకవని సందేశం పంపినట్లు అయిందని నిపుణులు అంటున్నారు.

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో నిషేధిత లష్కర్-ఎ-తాయిబా బృందాన్ని టీఆర్ఎఫ్‌గా రీబ్రాండ్ చేశారు. పాక్ మిలిటరీ, ఐఎస్ఐ దిశానిర్దేశంతో ఈ బృందం పనిచేస్తుంది. టీఆర్ఎఫ్‌తో తమకు సంబంధం లేదని, ఆర్టికల్ 370 రద్దుతో ఆగ్రహించిన కశ్మీరీలే దీన్ని ఏర్పాటు చేశారని పాక్ బుకాయిస్తూ వచ్చింది. అయితే టీఆర్ఎఫ్‌కు పాకిస్తాన్‌లోని ఎల్ఈటీ నాయకత్వం వహిస్తూ వారికి శిక్షణ, డబ్బు అందజేస్తుంది.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) దృష్టి నుంచి తప్పించుకునేందుకే ఎల్ఈటీని టీఆర్ఎఫ్‌గా రీబ్రాండ్ చేసినట్లు నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యులు వీళ్లు అంటూ అంతర్జాతీయంగా సింపతీ కూడా సంపాదించాలని టీఆర్ఎఫ్ భావించింది. దీని కోసమే పహెల్గాం ఉగ్రదాడిని ఉపయోగించుకోవాలని చూసింది. కానీ ఈ దాడి చేయాలనే ఆదేశాలు నేరుగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నుంచే వచ్చినట్లు సమాచారం.

Next Story