వెనక్కి తగ్గని మరాఠాలు: మరోసారి ఉద్యమానికి పిలుపు

by Dishanational2 |
వెనక్కి తగ్గని మరాఠాలు: మరోసారి ఉద్యమానికి పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు మహారాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర శాసన మండలిలోనూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. అయితే ఈ బిల్లుపై సంతృప్తి చెందని మరాఠాలు మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరాంగే తన నిరాహార దీక్షను విరమించలేదు. ఈ నెల 24న మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేగాక మార్చ్ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు. షిండే ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. బిల్లుకు సంబంధించి మరాఠాల డిమాండ్ నెరవేరలేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ కోటా 50శాతం కంటే ఎక్కువగా ఉన్నందున, ఈ బిల్లు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో రిజర్వేషన్ పరిమితి 50శాతం దాటినందున మరాఠా కమ్యూనిటీకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరాఠాల ఆవేదనకు కారణమిదే?

మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం మరాఠాలకు 10శాతం రిజర్వేషన్ లభిస్తుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న 52శాతం రిజర్వేషన్ కలుపుకుని..రిజర్వేషన్ పరిమితి 62శాతానికి పెరుగుతుంది. దీంతో సుప్రీంకోర్టు 1992లో నిర్దేశించిన 50శాతం రిజర్వేషన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి న్యాయపరంగా చిక్కులు ఉన్నందున ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉండదు. గతంలో 2014లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా.. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఉల్లంఘించిందని బాంబే హైకోర్టు దానిని కొట్టివేసింది. అలాగే 2018లోనూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయగా.. దీనిని కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మరోసారి సైతం అదే విధాన్ని ప్రభుత్వం అవలంభించందని ఇది మరాఠాలను మోసం చేయడమేనని జరాంగే అభిప్రాయపడుతున్నారు. ఓబీసీ కోటా నుంచి, 50 శాతం కంటే తక్కువ ఉన్న రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed