రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

by Malleboina Mahesh |

గత కొంత కాలంగా ఓట్ చోరి పేరుతో ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తాజాగా మరోసారి అవె విమర్శలు చేశారు.

రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా ఓట్ చోరి పేరుతో ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తాజాగా మరోసారి అవె విమర్శలు చేశారు. ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఈ సారి హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లను చేర్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Union Minister Kiren Rijiju) తీవ్రస్థాయిలో స్పందించారు. నేడు దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “ఈ ప్రెస్‌ మీట్‌ నాకు అంత సౌకర్యంగా లేదు, ఎందుకంటే మంచి విషయాలపై మాట్లాడితే ఆనందంగా ఉంటుంది. కానీ ఇది లాజిక్‌ లేని, పాయింట్‌ లేని అంశం అయినా, మాట్లాడాల్సి వస్తుంది” అన్నారు. రాహుల్‌ గాంధీపై ఆరోపణలు చేస్తూ “గత పార్లమెంట్‌ సమావేశంలో ఆయన మింటా దేవి అనే మహిళ ఫోటోను టీషర్ట్‌పై ముద్రించి, తప్పుడు ప్రచారం చేశారు.

సాయంత్రానికి ఆ మహిళే కాంగ్రెస్‌ను తప్పుబట్టింది. ఆమెను 124 ఏళ్ల వయస్సు గలదిగా చూపించి అవమానించారు. తప్పుడు పేరు, తప్పుడు ఫోటో, తప్పుడు విషయం, ఇవే రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పద్ధతి. బీహార్‌ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆయన ఇప్పుడు హర్యానా కథ చెబుతున్నారు. ఎన్నికల దృష్టిని మళ్లించేందుకే అసంబద్ధ విషయాలను తెరపైకి తెస్తున్నారు. ఎన్నికల సమయంలో విదేశాలకు వెళ్తారు. కొన్నిసార్లు కాంబోడియా, థాయిలాండ్‌, ఇప్పుడు కొలంబియా కూడా వెళ్తున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తప్పుడు ఆలోచనలతో ఇక్కడ రాహుల్ గాంధీ కథనాలు సృష్టిస్తున్నాడు” అని కిరణ్ రిజిజు అన్నారు.అంతేకాక, రాజకీయ నాయకులు ప్రజలకు సంబంధించిన తాత్విక, గంభీర అంశాలపై చర్చించాలి కానీ ఇలాంటి “నిష్ప్రయోజక” విషయాలపై సమయం వృధా చేయకూడదని రాహుల్ గాంధీకి రిజిజు సూచించారు.

Next Story