కేరళలో యూడీఎఫ్ సునామీ.. 100కు పైగా స్థానాల్లో విజయం ఖాయం: రాహుల్ గాంధీ

by Malleboina Mahesh |

కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం ఖాయం; 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. సుధాకరన్‌తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.

కేరళలో యూడీఎఫ్ సునామీ.. 100కు పైగా స్థానాల్లో విజయం ఖాయం: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ (Assembly Elections Notification) వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలపై ఈ రోజు కాంగ్రెస్ సీఈసీ (Congress CEC) కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ సహా ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించిన కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పోటీలో నిలిచే అభ్యర్థులపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో (Kerala assembly elections) యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అత్యంత బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయబోతున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కేరళలో యూడీఎఫ్ ఐక్యంగా ఉందని, మార్పు కోరుకుంటున్న ప్రజలు తమ కూటమికి బ్రహ్మరథం పడతారని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరోవైపు, కన్నూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించిన సుధాకరన్‌ను పార్టీ హైకమాండ్ బుజ్జగించింది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరడంతో ఆయన వెనక్కి తగ్గారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కూటమి విజయం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తానని సుధాకరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌లో అధికార ఎల్డీఎఫ్ (LDF) ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story