సిక్కింలో పర్యాటకుల విలవిల.. లాచెన్‌లో చిక్కుకుపోయిన 800 మంది!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-06 02:28:39  IST  )

సిక్కింలోని లాచెన్‌లో పెను ప్రమాదమే తప్పింది. రహదారి తెగిపోవడంతో 800 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.

సిక్కింలో పర్యాటకుల విలవిల.. లాచెన్‌లో చిక్కుకుపోయిన 800 మంది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడుతూపాడుతూ హాలిడేస్‌ను ఎంజాయ్ చేద్దామని సిక్కిం‌‌కు వెళ్లి పర్యటకులు డేంజర్‌లో పడ్డారు. భారీగా మంచు కురుస్తుండటం, రోడ్లు ఎక్కడికక్కడ బ్రేక్ అవ్వడంతో సుమారు 800 మంది పర్యాటకులు మాంగన్ జిల్లాలోని లాచెన్ (Lachen) ప్రాంతంలో చిక్కుకుపోయారు. లాచెన్ - చుంగ్తాంగ్ మధ్య ఉన్న కనెక్టివిటీ రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం.. లాచెన్-చుంగ్తాంగ్ రహదారిపై ఉన్న ‘తరుమ్ చూ’ (Tarum Chu) బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు భారీగా తెగిపోయింది. దీంతో పర్యాటక వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో పర్యాటకులు ఎక్కడికక్కడే ఉండిపోవాలని, ప్రయాణాలు చేయవద్దని మాంగన్ జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

రంగంలోకి సైన్యం.. రెస్క్యూ ఆపరేషన్ షురూ

పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు భారత సైన్యం, ITBP, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన మంచును తొలగించి, రోడ్డును పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. వాతావరణం కాస్త మెరుగుపడితే సోమవారం ఉదయం నుంచి పర్యాటకులను గ్యాంగ్‌టక్ వైపు తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి లాచెన్‌లో ఉన్న పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని, వారికి అవసరమైన వసతి, ఆహార సౌకర్యాలను స్థానిక యంత్రాంగం పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story